భూమా టిడిపిలోకి వస్తున్నారా, లేదా?: చాలామందికి లోకేష్ ఆఫర్!?
విజయవాడ: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ఊహాగానాలు ప్రతి రోజు వినిపిస్తున్నాడు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు సైకిల్ ఎక్కుతారని మూడు రోజులుగా వినిపిస్తోంది.
వారితో పాటు ఆరు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, కడప జిల్లాలో కౌన్సిలర్లు, గుంటూరు జిల్లాలో సర్పంచులు మాత్రమే ఇప్పటి వరకు టిడిపిలో చేరుతున్నట్లుగా కనిపిస్తోంది. వైసిపి ముఖ్యనేతల పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు... కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలకు టిడిపి వారు ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని అంటున్నారు. అందరికీ ఓఫెన్ ఆఫర్లు ఇస్తున్నారని జగన్కు చెందిన సాక్షి పత్రిక పేర్కొంది.
మరీ ముఖ్యంగా, ఆపరేషన్ ఆకర్ష్ కోసం టిడిపిలో ఓ కమిటీ పని చేస్తోందని ఆరోపించింది. కొద్దిమంది సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు నయానో, భయానో చేరుతున్నారని, దానిని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రతిపక్ష నేతలను ఆకర్షించేందుకు ఐదుగురు టిడిపి నేతలు ప్రధానంగా పని చేస్తోందని పేర్కొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నేతృత్వంలో ఆ కమిటీ పని చేస్తోందని తెలుస్తోందని పేర్కొంది. కాగా, కడపకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, డిప్యూటీ మేయర్ మరో రెండు రోజుల్లో లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కనున్న విషయం తెలిసిందే.
తుని ఘటనపై చినరాజప్ప స్పందన
కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని ఘటన పైన సిఐడి దర్యాఫ్తు కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. అమాయకుల పైన తాము కేసులు పెట్టమని చెప్పారు. అలాగే శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని చెప్పారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు.