లోకేష్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోవద్దు?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 4వేల కిలోమీటర్ల దూరాన్ని 400 రోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.

ఎవరూ అడ్డంకులు సృష్టించవద్దు
లోకేష్ పాదయాత్రను ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. పాదయాత్రను నిలిపివేస్తామని, ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జగన్ పాదయాత్రకు తాము అనుమతించాం కదా.. మేం ఆరోజు అనుమతివ్వకుండా ఉంటే ఏమయ్యేదంటూ తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత పాదయాత్ర గురించి వైసీపీ నాయకులెవరూ మాట్లాడలేదు. పాదయాత్రను ఆపే ప్రయత్నాలుకానీ, పాదయాత్రపై అనవసర విమర్శలు కానీ ఎవరూ చేయవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

పాదయాత్ర అతి సున్నితమైన అంశం
పాదయాత్ర అనేది రాజకీయాల్లో అతి సున్నితమైన అంశం. ఈ విషయం గతంలో పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి జగన్ కు కూడా తెలుసు. అందుకే అధిష్టానం నుంచి పార్టీ నేతలకు పాదయాత్రపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు వెళ్లినట్లు భావిస్తున్నారు. అలాగే పోలీసుల నుంచి అడ్డంకులు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, నిబంధనల ప్రకారం నడుచుకుంటే చాలని చెప్పినట్లు సమాచారం.

నాయకుల ఆలోచనలకు భిన్నంగా జగన్
వైసీపీ నాయకుల ఆలోచనలకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచించారని, పాదయాత్రను ఆపడానికి ప్రయత్నిస్తే చంద్రబాబుకానీ, లోకేష్ కానీ వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా పోలీసు నిబంధనల మేరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఎవరూ అడ్డుకోవద్దని ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. పాదయాత్రలను ప్రస్తుతం ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, యువగళం వల్ల వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications