నారా లోకేష్ పాదయాత్ర... బాలయ్య 'డైవర్షన్' పాలిటిక్స్?
ఈనెల 27వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సిద్ధమవుతున్నవేళ డైవర్షన్ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. లోకేష్ కు పిల్లనిచ్చిన మామే అందుకు కారకుడయ్యారు. వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కినేని అభిమానులతోపాటు కాపు సంఘాలు కూడా భగ్గుమన్నాయి.

క్షమాపణ చెప్పకపోతే పాదయాత్రను అడ్డుకుంటాం..
ఈనెల 25వ తేదీలోగా బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. బాలయ్య స్పందించకపోతే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకొని తీరతామని హెచ్చరించింది. ఎస్వీ రంగారావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది. లేదంటే 26వ తేదీన వంగవీటి రంగా విగ్రహాలవద్ద మౌనప్రదర్శన చేపడతామని ప్రకటించింది. యువగళంను అడ్డుకోవడంద్వారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినట్లవుతోందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న తెలుగుదేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు వర్గానికి చెందినవారే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెస్తున్నారని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. 27వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటలకు కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజ అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. బాలకృష్ణ వ్యాఖ్యల దుమారం రేగడంతో దీన్ని వైసీపీ తనకు అనువుగా మార్చుకుంటోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అక్కినేని.. తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. నందమూరి తారకరామారావు, ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు కళామతల్లి ముద్దుబిడ్డలని, వారిని అవమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్లేనని ట్వీట్ చేశారు. నాగార్జున, సుమంత్ స్పందించాల్సి ఉంది.

హిందూపురంలో బాలకృష్ణను అడ్డుకోవాలని..
హిందూపురంలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు బాలకృష్ణ వెళ్లారు. ఆయన్ను కాపు సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే అభిమానులతో కలిసి బాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకవేళ కాపు సంఘాలు అడ్డుకుంటే, బాలయ్య అభిమానులు వ్యతిరేకిస్తు ఉాద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ముందుగానే బాలయ్య పాల్గొనే కార్యక్రమం దగ్గర గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుప్పంలో లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని కాపుసంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications