నారా లోకేష్ కు గాయాలు... పాదయాత్రలో...
భుజాలకు గాయాలు కావడంతో సెల్ఫీలు కూడా వేరేవారితో తీయిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 46వ రోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈరోజు పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించారు. ఆయన భుజాలకు గాయాలవడంతో సెల్ఫీలు తీయలేదు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు ప్రతిరోజు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉంటుంది. నిత్యం సుమారుగా వెయ్యి మంది లోకేష్ తో సెల్ఫీ దిగుతున్నారు. రెండు భుజాలకు గాయాలవడంతో సెల్ఫీలు తీయలేకపోతుండటంతో ఇతరుల సహాయంతో తీయించారు.
యాత్రలో భుజాలు పైకిలేపి ప్రజలకు అభివాదం చేసేందుకు కూడాలోకేష్ చాలా ఇబ్బంది పడుతూ కనిపించారు. భుజాలకు గాయాలవడంవల్లేనా, ఆరోగ్యపరంగా ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయనేది తెలియరాలేదు. అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్వాగతం పలకడానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తల ఒత్తిడిలో భుజాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో దీనిపైనే చర్చించుకుంటున్నారు.

నారా లోకేష్ ను బలిజ సామాజికవర్గానికి చెందిన పెద్దలు కలిశారు. టి.సదుం వీరి స్వగ్రామం. ఐదుశాతం రిజర్వేషన్ అమలవడంలేదని, బలిజలు వ్యాపారాలు చేసుకోవడానికి రాయితీపై రుణాలందించాలని కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను, బలిజలను అణచివేడయమే పనిగా పెట్టుకున్నారని, పవన్ కల్యాణ్, చినరాజప్ప, బొండా ఉమ లాంటివారిపై తప్పుడు కేసులు నమోదుచేసి వేధించారని లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కాపుల సంక్షేమానికి 5 సంవత్సరాల్లో రూ.3100 కోట్లు ఖర్చుచేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ నిర్వీర్యమైందన్నారు. గంగసానిపల్లిలో లోకేష్ ను టమోటా రైతులు కలిశారు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గిట్టుబాటు ధర లభించేలా చూడాలని, ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. జగన్ వల్ల రాయలసీమ రైతులు టమోటాను రోడ్డుపై పారబోస్తున్నారని, టీడీపీ రాగానే గిట్టుబాటు ధర కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications