లోకేశ్ పాదయాత్ర: ముహూర్తం - షెడ్యూల్ ఫిక్స్ : జగన్ రికార్డులపై గురి..!!
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్దమవుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచే గాంధీ జయంతి నాడు పాదయాత్ర చేయాలని తొలుత భావించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం మీ కోసం పాదయాత్ర అదే రోజున ప్రారంభించి సుదీర్ఘంగా నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా అదే రోజున యాత్ర చేపట్టాలని భావించినా..ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. ఇందు కోసం కొత్త ముహూర్తం ఖరారు చేసారు.

450 రోజులు ప్రజల్లోనే ఉండేలా
కొద్ది నెలల క్రితం సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేసారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ పైన కసరత్తు చేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలో లేరని స్పష్టమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాతో ఉన్నారు. దీంతో.. పాదయాత్ర ప్రారంభించి..ఎన్నికల ప్రచారంతో ముగించాలని నారా లోకేశ్ భావిస్తున్నారు.
దీంతో..సుదీర్ఘ పాదయాత్రకు నిర్ణయించారు. మొత్తం 450 రోజుల పాటుగా చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఈ యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం 2023 జనవరి లో ప్రారంభించి..2024 మార్చిలో ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కుప్పం టు ఇచ్ఛాపురం వరకు
జనవరి 26న పాదయాత్ర ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. కుప్పం టు శ్రీకాకుళం వరకు యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ గురి పెట్టిన ప్రధాన నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉంటూ..పరిస్థితులపై అధ్యయనం.. మార్పులు - సూచనలకు వీలుగా షెడ్యూల్ ఖారారు చేస్తున్నారు.
చంద్రబాబు పార్లమెంటరీ జిల్లాల పర్యటన ప్రారంభించినా.. మధ్యలో విరామం ఇచ్చారు. లోకేశ్ పాదయాత్ర చేస్తూ...వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత పైన ప్రచారం చేస్తూ ముందుకు సాగనున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రస్తుత సీఎం జగన్ చేసిన పాదయాత్ర రికార్డుల పైన గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష నేత హోదాలో నాడు ఏపీలోని 13 జిల్లాల్లోనూ పాదయాత్ర చేసారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో..341 రోజుల పాటు..3,648 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేసారు. ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభించి.. 2019 ఎన్నికల కు ముందు ఇచ్ఛాపురంలో ముగించారు.

ఎన్నికల వరకూ కొనసాగేలా ప్రణాళికలు
కొద్ది రోజుల విశ్రాంతి తరువాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు లోకేశ్ తన పాదయాత్రలో 450 రోజుల పాటు..వారంలో ఏడు రోజులు కొనసాగేలా..సాధ్యమైన మేర దాదాపుగా అన్ని నియోజకవర్గాలను టచ్ చేసే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది. 2024 ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది.
దీనికి అనుగుణంగానే పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. పార్టీలోనూ పట్టు పెంచుకొనేందుకు.. ప్రజలతోనూ మమేకం అయ్యేందుకు పాదయాత్ర దోహదం చేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటుగా క్షేత్ర స్థాయిలో పార్టీలోని పరిస్థితులు...ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అదే సమయంలో లోకేశ్ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ప్రసంగాలు సాగనున్నాయి. రోడ్ షో లు.. బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో రోడ్ షో లు నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో.. ఇప్పటికే ఏపీలో ముందుగానే ఎన్నికల వేడి మొదలైన వేళ.. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర..అటు జనసేన అధినేత తన రాష్ట్ర వ్యాప్త యాత్ర పైన ప్రణాళిలతో ఏపీలో ఎలక్షన్ హీట్ మొదలు కావటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications