ఢిల్లీలో లోకేశ్ ప్లాన్ బెడిసి కొట్టిందా - వాట్ నెక్స్ట్..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత జాతీయ స్థాయిలో జగన్ ను ఇరుకున పెట్టాలని టీడీపీ భావించింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నిరూపించే దిశగా ప్రయత్నాలు చేసింది. లోకేశ్ జాతీయ మీడియాలో చర్చల్లో పాల్గొన్నారు. కానీ, అక్కడ ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు. ఇక జాతీయ పార్టీల నేతలతోనూ సమావేశాలకు ప్రయత్నించారు. కానీ, సఫలం కాలేదు. దీంతో ఇప్పుడు తదుపరి కార్యాచరణపై చర్చ మొదలైంది.
చంద్రబాబు అరెస్ట్ ను ఎన్నికల వేళ టీడీపీ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. జనసేనాని పవన్ తో కలిసి లోకేశ్ జైలులో చంద్రబాబును కలిసారు. ఆ సమయంలోనే పొత్తుల ప్రకటన చేసారు. ఆ వెంటనే లోకేశ్ ఢిల్లీ బయల్దేరారు. పార్లమెంట్ సమావేశాల ముందు జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి లోకేశ్ ఢిల్లీలో మకాం వేసారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్కడ స్కిల్ స్కాంలో రూ 370 కోట్ల అడ్వాన్స్ పేమెంట్ విషయంలో సమాధానం చెప్పటానికి ఇబ్బంది పడ్డారు. అదే విధంగా విచారణలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలపైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

ప్రధానంగా 90:10 రేషియో MOU ప్రకారం ప్రైవేట్ సంస్ధ భాగమైన 90% నిధులు జమ చేయకముందే, మీ ప్రభుత్వం తన 10% భాగం నగదును ఎందుకు ముందే జమ చేసింది అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వక ఇబ్బందులు పడ్డారని వైసీపీ విమర్శిస్తోంది. ముందే సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్ధలతో డీల్ కుదుర్చుకుని, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి, టెండర్ లేకుండా నిధులు రిలీస్ చేసారా?
ఈ ప్రాజెక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రేటరీ చెప్పినా, ఆ నోట్ ని అతిక్రమించి మరీ మీరు ఎందుకు ఈ డీల్ ని కుదుర్చుకున్నారు..వంటి ప్రశ్నలతో లోకేశ్ ఆత్మరక్షణలో పడ్డారని వైసీపీ మద్దతు దారులు చెబుతున్నారు. అదే విధంగా జాతీయ నేతల మద్దతు విషయంలోనూ సరైన స్పందన కనిపించలేదు.

లోకేశ్ ఢిల్లీ వెళ్లే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో అటు బీజేపీ, ఇటు టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న శ్రేయోభిలాషులు ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. కానీ, అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం. దీంతో, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అటు పార్లమెంట్ లో లేవెనెత్తాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో లోకేశ్ పాల్గొన్నారు. రేపు (మంగళవారం) చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో, లోకేశ్ తిరిగి రాజమండ్రికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మంత్రులు నెక్స్ట్ లోకేశ్ అరెస్ట్ అని చెబుతుండటంతో...ఏం జరగబోతోందనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications