జగన్రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుంది; అందుకే దాడులు: వీడియోలతో నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పాలనలో ప్రజలపై చోటుచేసుకుంటున్న దాడులపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్న వైసిపి నేతల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
టీడీపీ నేత కారు ధ్వంసం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇవ్వటం దారుణం
ఏలూరు సభలో జగన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనం ఒక్కసారిగా లేచి అక్కడినుంచి వెళ్లిపోవడం పై ఇప్పటికే సెటైర్లు వేసిన లోకేష్ జగన్ దెబ్బకి జనం పరార్.. రైతుల్ని దగా చేసిన జగన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఇంత కన్నా ఆధారాలు కావాలా? అంటూ ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారును ధ్వంసం చేసి, ఆయనను చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంపై లోకేష్ మండిపడ్డారు.
జగన్రెడ్డిని చూసి జనం పారిపోతుండడంతో ఆయనలోని మూర్ఖపు ఫ్యాక్షన్ భూతం నిద్రలేచిందని పేర్కొన్న లోకేష్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, జగన్రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తోన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్శర్మ కారు.. ధ్వంసం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం దారుణం అంటూ పేర్కొన్నారు.
దుకాణం సర్దుకోండి ఇక.. ఆకు రౌడీలకు ఎవరూ భయపడరు
జగన్రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుందని లోకేష్ విమర్శించారు. ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి గారి సీను కాలిపోయి చాన్నాళ్లయ్యిందని పేర్కొన్న లోకేష్ మీ మాటలు బూటకమని, మీ చేతలు నాటకమని జనానికి తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. దుకాణం సర్దుకోండి ఇక. మీ ఆకురౌడీలకిఎవ్వరూ భయపడరు అంటూ లోకేష్ పేర్కొన్నారు. సాయినాథ్ శర్మకి అండగా తెలుగుదేశం పార్టీ యావత్తు ఉందని లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాదు సాయినాథ్ శర్మ కారును ధ్వంసం చేసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు లోకేష్.
దమ్ములేని వైసీపీ నాయకులు దళిత మహిళ ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా?
ఇక మరోవైపు కంతేరులో మహిళ వెంకాయమ్మ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పింది. దీంతో సదరు మహిళ వెంకాయమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను బెదిరించారని పేర్కొన్న లోకేష్ జగన్రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అంటూ లోకేష్ మండిపడ్డారు.
మిమల్ని వ్యతిరేకిస్తే ఐదుకోట్లమందిపైనా దాడి చేయిస్తారా జగన్రెడ్డి గారు?
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు అని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు అని లోకేష్ పేర్కొన్నారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోంది.. ఐదుకోట్లమందిపైనా దాడి చేయిస్తారా జగన్రెడ్డి గారు? అంటూ లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.