ఉద్యోగం ఊడగొట్టొద్దు: సీఎం అయ్యే అవకాశంపై లోకేష్ చమత్కారం, జగన్కు చురక
చిత్తూరు: మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని, కులం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు రద్దు చేస్తారా అని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. తనకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం పోయేలా చేయవద్దని (టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి) నారా లోకేష్ చమత్కరించారు.
ఆయన యువ చైతన్య యాత్రలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

వచ్చే ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు చూస్తున్నామని చెప్పారు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సమయం పడుతుందన్నారు. ఆవేశపరుడికి, నాయకుడికి తేడా ఉంటుందన్నారు.
రిజర్వేషన్ల పైన చర్చ జరగాలని, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. టిడిపి నుంచి గెలిచిన 104 మంది ఎమ్మెల్యేల్లో 67 మంది కొత్త వారే అన్నారు. చాలామంది మధ్య వయస్కులే అన్నారు. యువతకు తమ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు.
ఐటీ, పరిశ్రమలు..
అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. విశాఖలో ఐటీ హబ్, రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో రెండూ కలిపి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
విభజన అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఎక్కువ మొత్తం తెలంగాణలో ఉండిపోయాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కొన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయని, వీటికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు.
విశాఖ, తూగో జిల్లాల్లో వీటి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడలో మెడికల్ టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమయ్యాయన్నారు.
సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందమని రాద్దాంతం చేస్తోందని, సింగపూర్లో అవినీతి చేస్తే ఉరిశిక్ష వేస్తారని, అలాంటి ప్రభుత్వంతో తాము పని చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షాలు రాజధాని అమరావతిని నిర్మించకుండా ఇబ్బంది పెడుతున్నాయన్నారు. కానీ పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications