జగన్ అడ్డంగా పడుకున్నా.., నా తండ్రితో చిచ్చు పెట్టాలని: లోకేష్
విశాఖ: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా పడుకున్నా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన మహానాడులో ప్రసంగించారు. విశాఖను ఐటీ హబ్గా చేసే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.
36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ వేసిన టిడిపి అనే విత్తనం ఇప్పుడు మహావృక్షమయిందన్నారు. కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చిన చంద్రబాబు ఆ మొక్కను కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. 36 ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు.
విశాఖలో తనకు రెండు సముద్రాలు కనిపిస్తున్నాయని, ఒకటి మహా సముద్రం, రెండోది టిడిపి మహానాడు సముద్రమని అభిప్రాయపడ్డారు. విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ ఉంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలమా అనే పరిస్థితి ఉండేదన్నారు.
జగన్ విమర్శలు విడ్డూరం
వైసిపి అధినేత వైయస్ జగన్, ఆయన పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరమని నారా లోకేష్ అన్నారు. కానీ మూడేళ్లలో రూ.లక్షా 35వేల కోట్లు వచ్చాయని చెప్పారు. 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించామని చెప్పారు.
నేనే చంద్రబాబు వేగం అందుకోలేకపోతున్నా
చంద్రబాబు ఏపీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని చెప్పారు. 67 ఏళ్ల సంవత్సరాల వయస్సులో పని చేస్తున్నారని, 34 ఏళ్ల వయస్సు ఉన్న నేనే చంద్రబాబు వేగం అందుకోలేకపోతున్నానని లోకేష్ అన్నారు. చంద్రబాబు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారన్నారు.
విశాఖను ఐటీ హబ్గా చేసే బాధ్యత నాదే
విశాఖను ఏపీ ఐటీ హబ్గా చేసే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రానికి పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. వీటి వల్ల వేలాది ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
విశాఖకు ఎప్పుడు వచ్చినా తనకు భయం వేస్తుందని, ఇక్కడ ఉండాలనిపిస్తోందని నారా లోకేష్ అన్నారు. ఇలాంటి విశాఖనే రాబోయే రెండేళ్లలో ఐటీ హబ్గా చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు.
జగన్ అడ్డంగా పడుకున్నా..
బోగాపురం విమానాశ్రయం, ఇతర పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దని జగన్ చెబుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని సింగపూర్కు చెబుతారన్నారు. కానీ ఆయన వల్ల ఏం కాదన్నారు. అరచేతిని అఢ్డుగా పెట్టి సూర్యకాంతిని ఆపలేరని, జగన్ అడ్డంగా పడుకున్నా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.
విపక్షాలు చిచ్చు పెట్టేందుకు.. నాకు నా తండ్రికే చిచ్చు పెట్టారు
జగన్ ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టగలరని, మనం అప్రమత్తంగా ఉండాలని టిడిపి నేతలు, కార్యకర్తలకు సూచించారు. జగన్, ఆయన దొంగ పత్రిక తనకు, తన తండ్రికి కూడా మధ్య చిచ్చు పెట్టాలని చూశారని నారా లోకేష్ ఆరోపించారు. తాను ఓ ట్రెయినింగ్కు వెళ్తుంటే.. అప్పటికే దొంగ పత్రికలో స్క్రోలింగ్ వేశారని... చంద్రబాబుపై అలిగిన లోకేష్ అని వేశారని మండిపడ్డారు. అవకాశమిస్తే కుటుంబంలోనే చిచ్చు పెడతారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కులాల మధ్య చిచ్చు ఇలా..
ఓ ట్రెయినింగ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ తాను వేదికపై నుంచి చేతులు ఊపి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను.. ఏమిటన్నా అని అడిగానని, ఆ ఫోటోను దొంగ పత్రికలో పెద్దగా వేసి తాను అవమానించానని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని లోకేష్ విమర్శించారు.
ప్రాంతాల మధ్య చిచ్చు..
చంద్రబాబు పట్టిసీమకు నీరు తీసుకు రావాలని కష్టపడితో దొంగబ్బాయి మాత్రం గోదావరి జిల్లాలకు వెళ్లి.. ఇక్కడి నీరు సీమకు తీసుకు వెళ్తున్నారని చెప్పాడని, రాయలసీమకు వెళ్లి, పట్టిసీమతో ఒక్క చుక్క రాదని చెప్పాడని, ఇది ప్రాంతాల మధ్య చిచ్చు అన్నారు.
ఎక్కడకు రావాలి.. జగన్కు సవాల్
నేను పుట్టే నాటికి నా తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, నా కొడుకు దేవాన్ష్ పుట్టే నాటికి ఆయన తాత చంద్రబాబు సీఎం అని, కానీ మాపై అవినీతి ఆరోపణలను జగన్ నిరూపించారా అని సవాల్ చేశారు. మన ఇద్దరి అవినీతిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. ఎక్కడకు రమ్మంటారో చెప్పాలన్నారు. మా తాత, నాన్నలా నాకు గొప్ప పేరు వస్తుందో లేదో తెలియదు కానీ, వారికి చెడ్డపేరు మాత్రం తీసుకు రానని చెప్పారు.