Nara Lokesh : చేపా..చేపా..ఎందుకు షాప్ తీయలేదు..ఫిష్ ఆంధ్రా షాపుతో లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్..
పుట్టపర్తి : ఏపీలో యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన ఈ యాత్ర ప్రస్తుతం సత్యసాయిజిల్లా పుట్టపర్తిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మరోసారి ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో సవాల్ విసిరారు. ఇప్పటివరకూ తాము స్ధాపించిన సంస్ధలు,కంపెనీలు,ఉద్యోగులతో సెల్ఫీలు పెట్టిన లోకేష్.. ఈసారి వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర షాపు వద్ద సెల్ఫీ తీసుకుని సవాల్ విసిరారు.
చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట. అట్టా ఉంది మన జగన్ రెడ్డి చేపల బజార్ల తీరు అంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ లో పేర్కొన్నారు. చేపల దుకాణం ఎందుకు తీయలేదంటే, సవాలక్ష కారణాలు. బులుగు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఫిష్ ఆంధ్ర దుకాణాల నిర్వహణలో ఉంటే బాగుండేది. ఓబులదేవచెరువులో క్లోజ్ అయిన ఫిష్ ఆంధ్ర ముందు ఈ సెల్ఫీ దిగాను. గతంలో చిత్తూరుజిల్లాలో ఫిష్ ఆంధ్ర మూతపై ఓ సెల్ఫీతో ప్రశ్నించాను. మౌనం అర్దాంగీకారం అనుకోవచ్చా? ఫిష్ ఆంధ్ర శాశ్వతంగా ఫినిష్ అయినట్టేనా? అంటూ జగన్ సర్కార్ పై ప్రశ్నలు సంధించారు.

మరోవైపు ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గం, ఓడీసీలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు వచ్చిఆయనకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా హారతులు ఇస్తూ మహిళలు స్వాగతం పలికారు. తనను చూసేందుకు వచ్చినవారందరికీ సెల్ఫీలు ఇస్తూ పలకరిస్తూ లోకేష్ ముందుకు కదిలారు. ముస్లింలు తమ సమస్యలు లోకేష్ తో చెప్పుకున్నారు. అలాగే చిరు వ్యాపారులు తమకు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో ఫిట్టింగ్, కట్టింగ్ ప్రభుత్వం నడుస్తోందని లోకేష్ ఈ సందర్భంగా ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications