విశాఖ ప్రమాదంపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబానికి రూ.కోటి ఇవ్వండి: సీపీఐ రామకృష్ణ..
విశాఖలో మరో ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీలో గల సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకయ్యింది. ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్ధతకు గురయ్యారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైజాగ్లో మరో ఘటన విచారకరమని పేర్కొన్నారు. సీపీఐ నేత రామకృష్ణ కూడా రియాక్టయ్యారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారం అందించాలని కోరారు.

భయాందోళన..
సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్సను అందజేయాలని కోరారు. రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజి అవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజీ ఘటన మరచిపోకముందే మరో ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. విశాఖలో వరస ప్రమాదాలు జరగడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

కఠిన చర్యలు
ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవకముందే మరో ఘటన జరగడం దురదృష్టకరమని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. మృతులకు సంతాపం తెలిపి, కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గల కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర దర్యాప్తు చేయించాలని.. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు.

రూ.కోటి ఇవ్వండి..
ప్రమాదంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. ఒక్కో ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వరస ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు గల పరిశ్రమలను తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్టణంలో విషవాయువుల లీకేజీ ఘటనలు జరుగుతుండటంతో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ఇద్దరు మృతి..
విశాఖపట్టణం పరవాడ ఫార్మా సిటీలో గల సాయినార్ కెమికల్స్లో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్ కాగా.. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎల్వీ చంద్రశేఖర్, పీ ఆనంద్ బాబు, డీ జానకీ రామ్, ఎం సూర్యనారాయణకు గాజువాకలోని ఆర్కే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ విననయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Recommended Video

ఇదీ కారణం..?
హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్దకు రావడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ఘటనపై కలెక్టర్తో ఎంపీ విజయసాయిరెడ్డి మట్లాడి.. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.












Click it and Unblock the Notifications