వైసీపీనేతలు మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరివెయ్యాలి: నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా అయ్యన్నపాత్రుడుపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అధికార వైసీపీ, టీడీపీకి మధ్య రచ్చకు కారణమైంది. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
వైసీపీ నేతలపై, పోలీసులపై విరుచుకుపడ్డ లోకేష్
ఇక తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేసిన క్రమంలో వైసిపి నాయకులపై నారా లోకేష్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసిపి నేతలపై, పోలీసుల తీరుపై విరుచుకుపడ్డ లోకేష్ టీడీపీ నేతలు కేసులు పెడితే పోలీసులు స్పందించడం లేదని, అదే వైసిపి నేతలు కేసులు పెడితే అరెస్టు చేయడానికి వస్తున్నారు అంటూ మండిపడ్డారు.
వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు, మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరివెయ్యాలి
మా అయ్యన్నపాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్టు చేయడానికి వస్తే, వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు, మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వేయాలంటూ నారా లోకేష్ పేర్కొన్నారు . ఉచ్ఛనీచాలు మరచి వైసిపి నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసిపి నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు జిల్లాలు దాటి మరీ టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
పోలీసుల చొక్కా పట్టుకున్న మంత్రులపై పోలీసుల చర్యలు శూన్యం
పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైసిపి నేతలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అలాంటి వారిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారు అని నారా లోకేష్ పోలీసులకు హితవుపలికారు. టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Recommended Video
అయ్యన్నపాత్రుడి ఇంటికి నల్లజర్ల పోలీసులు.. నోటీస్ ఇచ్చే యత్నం
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి ఈ రోజు ఉదయం పోలీసులు వెళ్లారు. నోటీస్ ఇవ్వడానికి నర్సీపట్నం లోని అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులకు అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరంటూ బంధువులు సమాధానం చెప్పారు. 41 ఏ కింద నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులు అయ్యన్నపాత్రుడు లేకపోవడంతో అక్కడ ఆయన కోసం ఎదురు చూశారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నాయకులను, పోలీసులను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.