కోటి మంది తెలుగు తమ్ముళ్లకు లోకేష్ న్యూఇయర్ గిఫ్ట్..!
ఏపీలో కొత్త సంవత్సర వేళ తెలుగు తమ్ముళ్లకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. పార్టీ కోసం క్షేత్రస్ధాయిలో శ్రమిస్తున్న కోటి మంది కార్యకర్తలకు మేలు చేసేలా ఓ కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా నిస్వార్ధంగా పనిచేస్తున్న కార్యకర్తలకు మేలు చేసేలా ఈ ఒప్పందం కుదిరింది. దీంతో కొత్త సంవత్సరంలో టీడీపీ కార్యకర్తలకు లోకేష్ కానుక అందించినట్లయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం అని చెప్తున్నారు.

ఇన్సూరెన్స్ కంపెనీలతో లోకేష్ కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాది మొత్తానికి వర్తించబోతోంది. ఇలా కోటిమంది కార్యకర్తల ప్రమాద భీమా కోసం తొలివిడతలో టీడీపీ 42కోట్లు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ప్రమాదాలు జరిగిన సమయంలో 5లక్షల వరకూ భీమా సొమ్ము లభిస్తుంది. దీంతో కలిపి కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ నారా లోకేష్ మొత్తం 138 కోట్లు ఖర్చుచేసినట్లయింది.
గత వైసీపీ ప్రభుత్వంలోనే వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న టీడీపీ కార్యకర్తలను ఆదుకునేందుకు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో లోకేష్ ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబ సభ్యుల లాగే పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications