తాలిబాన్లు అన్న నయం.. జగన్ పాలనపై నారా లోకేశ్ ఫైర్
ఏపీలో జగన్ పాలనపై విపక్ష నేతలు ఎండగడుతూనే ఉన్నారు. చంద్రబాబు, ఇతర సీనియర్ నేతలు సమయం దొరికితే చాలు విరుచుకుపడుతుంటారు. అప్పుడప్పుడు నారా లోకేశ్ కూడా ఫైర్ అవుతుంటారు. జగన్ పాలన ఆప్ఘన్ల కన్నా దారుణంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ఫైరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్లో కల్లోలం సృష్టించిన తాలిబన్ల కన్నా వైకాపాబన్లు ఘోరంగా తయారయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి, తన ఇంట్లోనే నాటు తుపాకులు తయారుచేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వెంకటేశ్ సింగ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఈ తుపాకులు తయారు చేసినట్లు గుర్తించారు.
అతని వద్ద నుంచి 12 రెడీ టు యూజ్ తుపాకులు, 6 ఇతర తుపాకులు, గన్ పౌడర్, 33 కేజీల చిన్న ఇనుప గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై నారా లోకేశ్ స్పందించారు. ''తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. తాలిబన్లు నల్లమందు ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీతో మొదలై, నేడు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారు'' అంటూ ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ హయాం గురించి కూడా ప్రస్తావించిన లోకేశ్.. ''చంద్రబాబు నెలకొల్పిన మెడ్టెక్ జోన్లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే.. వైఎస్ జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్ర'' అని సెటైర్ వేశారు.
జగన్ పాలన తాలిబాన్ల కన్నా దారుణంగా ఉందని లోకేశ్ విరుచుకుపడ్డారు. తాలిబాన్లు అన్న కాస్త కరుణ ఉందన్నారు. కానీ జగన్ హయాంలో కరుణ, కటాక్షం లేదని వివరించారు. ముఖ్యంగా ప్రజలను హింసించడం తప్పడం లేదన్నారు. జగన్ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.