జన్మదినోత్సవమని భజన కార్యక్రమాలకు తప్ప మహిళల రక్షణకేదీ సమయం .. జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ ఉంటే, మరోపక్క సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే ఫేక్ సీఎం తెగ ట్రెండ్ అవుతుంది. మరోపక్క ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ జగన్ డైనమిక్ యంగ్ లీడర్ అన్న చిరంజీవి , చంద్రబాబు విషెస్, మహేష్ బాబు ట్వీట్
ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ దహనం ఘటనపై నారా లోకేష్ ఆగ్రహం
ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవదహనం చేస్తే సీఎం జగన్ స్పందించలేదని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కు దివ్యాంగురాలు భువనేశ్వరి విషయంలో స్పందించడానికి హృదయం, సమయం రెండు లేవని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా సీఎం జగన్ కు మహిళల విషయంలో ఉన్న చిత్తశుద్ధి మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. జన్మదినోత్సవం అంటూ భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం కూడా మహిళల రక్షణ చర్యలకు జగన్ ఇవ్వకపోవడం బాధిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.
సీఎం జగన్ 18 నెలల పాలన లో 310 ఘటనలు జరిగినా చలనం లేదు
రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నా, ఆందోళనకర పరిస్థితులు పెరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఆయన వాపోయారు. సీఎం జగన్ 18 నెలల పాలన లో 310 ఘటనలు జరిగినా ప్రభుత్వ తీరులో ఏమాత్రం చలనం లేకుండా ఉందని నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు,అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీలో దిశా చట్టం పేరుతో చట్టాలు తీసుకొచ్చినా, చట్టాల పేరుతో పబ్లిసిటీ పిచ్చి తప్ప ఒక మహిళకు న్యాయం జరగలేదని, ఒక్క మృగాడికి శిక్ష పడలేదని లోకేష్ విమర్శించారు.
భువనేశ్వరి ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
భువనేశ్వరి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన లోకేష్, ఆమె సజీవ దహనానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. భువనేశ్వరి కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. ఏది ఏమైనా ఈ రోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం టీడీపీ అధినేత జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ మాత్రం మండిపడుతున్నారు.