వసూల్ రెడ్డి గారు నిద్ర లేచేదేప్పుడు? దీపావళి నాడు పెట్రోల్, డీజిల్ ధరలపై జగన్ ను టార్గెట్ చేసిన నారా లోకేష్
దీపావళి పండుగ రోజు కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . కేంద్రం పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించి దీపావళికి సామాన్యులకు ఊరట కలిగించిన నేపధ్యంలో జగన్ సర్కార్ ఎందుకు తగ్గించటం లేదని ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు లోకేష్.

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం, అనేక రాష్ట్రాలు కూడా మోడీ బాటలో
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై ఒకేసారి ఐదు రూపాయలు, పది రూపాయలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సామాన్యులకు భారీ షాక్ ఇస్తూ పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుక ఇచ్చారు . మోడీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని పెట్రోల్ పై ఐదు రూపాయలు, డీజిల్ ధర పై పది రూపాయలు తగ్గించింది. ఇక మోడీ బాటలో అనేక రాష్ట్రాలు తమ వంతుగా పన్నులను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రం తగ్గించిన ధరలకు అదనంగా మరి కొంత ధరలను తగ్గించి ఊరటనిచ్చాయి.

వసూల్ రెడ్డి గారు నిద్ర లేచేది ఎప్పుడు అంటూ లోకేష్ ప్రశ్న
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ పెట్రోల్ డీజిల్, ధరలను తగ్గించక పోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. వసూల్ రెడ్డి గారు నిద్ర లేచేది ఎప్పుడూ అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడూ అంటూ వైసీపీ సర్కార్ ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారం తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మాటేమిటి అంటూ ప్రశ్నించారు.

పన్నుల భారం తగ్గించేందుకు జగన్ కు మనసు రావటం లేదు
హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పన్నెండు రూపాయలు తగ్గించాయని, అస్సాం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై ఏడు రూపాయలు తగ్గించాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 6.07 పైసలు తగ్గించిందని డీజిల్ పై 11 రూపాయలు 75పైసలు తగ్గించిందని ఇక గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని పేర్కొన్న నారా లోకేష్ కేంద్రం ఇతర రాష్ట్రాలన్నీ పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించినా వసూల్ రెడ్డి గారికి మాత్రం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి మనసు రావడం లేదంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
Recommended Video

వైఎస్ జగన్ జనంపై కరుణ చూపాలని కోరుకున్న నారా లోకేష్
అంతేకాదు నిత్యావసరాలు, కరెంటు, ఆస్తిపన్ను, చివరకు చెత్త పైన కూడా పన్నులు వేసిన మీ బాదుడుకు జన జీవితాలు అగమ్యగోచరం అయ్యాయని పేర్కొన్న నారా లోకేష్ దేశమంతా పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తున్న నేపథ్యంలో వైయస్ జగన్ జనంపై కరుణ చూపాలని కోరుతున్నాను అంటూ నారా లోకేష్ పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఏపీ రాష్ట్రంలో తగ్గించే దిశగా జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications