ycp కీలకనేత ఇంటికి వెళ్లిన నారా లోకేష్!!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ నేతలతో కలిసి అగ్రహారంలోని ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. లూథరన్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
కుడిచేత్తో రూ.10 ఇస్తూ.. ఎడమచేత్తో రూ.100 తీసుకుంటున్నారు!
వైఎస్ జగన్ పాలనలో పన్నులు భారీగా పెరిగాయాని, నిత్యావసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని లోకేష్ విమర్శించారు. విద్యుత్తు ఛార్జీలను పెంచడంతోపాటు ఇంటి పన్ను పెంచారని, చెత్తపై పన్ను వేస్తున్నారని, ఆర్టీసీ ఛార్జీల పెంపువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సంక్షేమం గోరంత ఉందని, బాదుడే బాదుడు పేరుతో జగన్ చేస్తున్న దోపిడీ కొండంత అని మండిపడ్డారు. కుడిచేత్తో పదిరూపాయిలిస్తూ ఎడమచేత్తో వందరూపాయలు కొట్టేస్తున్నారన్నారు. అడ్డగోలుగా పెంచిన పన్నులతో ఇబ్బందులకు గురవుతున్నామంటూ స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. పన్నుల భారం తగ్గి సామాన్యుడు హాయిగా బతకాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని, చంద్రన్న ప్రభుత్వం రావాలన్నారు.
శ్రీకృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్లిన లోకేష్!
నారా లోకేష్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నారా లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్ తోపాటు పలువురు టీటీపీ నేతలు కూడా శ్రీకృష్ణను క్షేమ సమాచారాలడిగి తెలుసుకున్నారు.
అవకాశం దొరికినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన
పార్టీ తరఫున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతున్న లోకేష్ తనకు సమయం చిక్కినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఓటమిపాలైనప్పటికీ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించగలననే ధీమాను వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కలిసివస్తుందని భావిస్తున్నారు.
లోకేష్ ను మరోసారి ఓడించేందుకు అధికార వైసీపీ కూడా పలు ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటివరకు టీడీపీలో ఉన్న గంజి చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవడంతోపాటు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును కూడా చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరగబోయే నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటని రాజకీయ విశ్లేషకులుర భావిస్తున్నారు