సీఐడీ విచారణకు నారా లోకేష్- కొత్త పిటీషన్: రింగ్ రోడ్డు
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
అదే సమయంలో ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో కుంభకోణాన్ని సైతం తెర మీదికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంలో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులను సైతం జారీ చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ నారా లోకేష్కు నోటీసులను అందజేశారు.

నిజానికి- ఈ 4వ తేదీ నాడే నారా లోకేష్ను విచారించాల్సి ఉన్నప్పటికీ- నోటీసుల్లో పొందుపరిచిన కొన్ని అంశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఏపీ హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేశారు. తాను డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అకౌంట్లను సైతం విచారణ సమయంలో సమర్పించాలంటూ సీఐడీ అధికారులు ఆదేశించడాన్ని సవాల్ చేశారు.
ఈ నెల 12వ తేదీ వరకు నారా లోకేష్ను అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు.. సీఐడీ అధికారులను సూచించింది. అదే సమయంలో 10వ తేదీన విచారణకు హాజరు కావాలనీ నారా లోకేష్ను ఆదేశించింది. దీనితో నేడు నారా లోకేష్ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
విచారణను ఎదుర్కొనడానికి నారా లోకేష్ ఇప్పటికే ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకూ నోటీసులు అందిన విషయం తెలిసిందే. సీఐడీ అధికారులు ఆయనకూ నోటీసులను ఇచ్చారు.
ఈ కేసులో తాజాగా మరో పిటీషన్ను సైతం సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. నారాయణ భార్య రమాదేవి పేరును చేర్చారు. ఆమె బంధువు రాపూరి సాంబశివరావు, నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్ భార్య ప్రమీల, నారాయణ బంధువు ఆవుల మణిశంకర్ పేర్లను చేరుస్తూ సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు.












Click it and Unblock the Notifications