సాయికృష్ణ డబ్బు వసూళ్లపై సంబంధం లేదు, అభిమానిగానే తెలుసు: నారా రోహిత్
విజయవాడ: తన పేరు చెప్పి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణతో తనకెలాంటి సంబంధం లేదని టాలీవుడ్ యంగ్ హీరో, టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ స్పష్టం చేశారు.
తన సినిమాల పేరుతో టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్)కు చెందిన నేత సాయికృష్ణ విజయవాడలోని పలువురు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడని, అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని సోమవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై నారా రోహిత్ చాలా వేగంగా స్పందించారు. సాయికృష్ణ తనకు అభిమానిగానే తెలుసని స్పష్టం చేశారు. అయితే అతడు చేసిన అక్రమ వసూళ్లతో తనకెలాంటి సంబంధం లేని తేల్చి చెప్పాడు. వివరాల్లోకి వెళితే టీఎన్ఎస్ఎఫ్కు చెందిన నేత సాయికృష్ణ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు.
ముఖ్యంగా నారా రోహిత్ సినిమాలను సాకుగా చూపి అతడు విజయవాడలోని పలువురి వ్యక్తుల వద్ద కోట్లాది రూపాయలు వసూళ్లు చేశాడు. అయితే గడువు ముగిసినా, అతడు రుణం చెల్లించకపోవడంతో రుణదాతలు అతడిని నిలదీశారు.
డబ్బు కోసం వేధిస్తే కాల్ మనీ కింద కేసు పెడతానంటూ సాయికృష్ణ రుణ దాతలను బెదిరించాడని సమాచారం. దీంతో కంగారుపడిన రుణ దాతలు అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రుణదాతల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సాయికృష్ణ ఆర్ధిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే నారా రోహితే పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణ ఖండించాడు. సోమవారం సాయికృష్ణ ఓ తెలుగు ఛానల్తో మాట్లాడుతూ తాను కేవలం అప్పులు మాత్రమే తీసుకున్నానని, అది మాత్రం వాస్తవమని పేర్కొన్నాడు.
గత కొంతకాలంగా తనకు ఎలాంటి పని లేక ఖాళీగా ఉన్నానని, అంతేకానీ ఎవరి వద్ద నుంచి తాను వసూళ్లకు పాల్పడలేదన్నాడు. తాను తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక టాలీవుడ్ నటుడు నారా రోహిత్కు తాను కేవలం అభిమానినని, ఆయన సినిమాలు చూస్తానని తెలిపాడు.
అంతేగాక తెలుగుదేశం పార్టీలో కూడా తాను క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంటానని తెలిపాడు. తెలుగుదేశం పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇతర పార్టీలవారే ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నారని సాయికృష్ణ చెప్పుకొచ్చాడు.