షర్మిలను పక్కన పెట్టాడు: జగన్పై నర్సింగరాజు సెటైర్
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సినీనటుడు నర్సింగరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జై సమైక్యాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అతని సోదరి షర్మిల 3వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారని తెలిపారు. అయితే జైల్లోనుంచి తిరిగి వచ్చిన జగన్ ఆమెను పక్కన పెట్టారని అన్నారు.
షర్మిలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. సొంత సోదరికి ఏం చేయలేని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేస్తాడని నర్సింగరాజు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదని, యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని, ఆయనకు సమైక్యవాదులందరూ మద్దతుగా నిలవాలని నర్సింగరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు ఎంతో ఆవేదనకు గురయ్యారని, ఆందోళనలు నిర్వహించారని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నర్సింగరాజు తెలిపారు. తెలుగు ప్రజల ఇబ్బందులను చూసిన కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని వదులుకుని పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొవడానికే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టారని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచి ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లాలని నర్సింగరాజు ప్రజలకు పిలుపునిచ్చాడు.