చచ్చిపోయేవారు: పవన్పై నారాయణ, బిజినెస్కోసం నాగ్
కాంగ్రెసు పార్టీతో పొత్తులో భాగంగా తాము ఖమ్మం లోకసభ స్థానాన్ని అడగలేదని చెప్పారు. తాము అడిగింది నల్గొండ లోకసభ స్థానం అన్నారు. విప్లవ భావాలు అని చెప్పే పవన్... మోడీని కలవడమేమిటని ఆయన అభిప్రాయపడ్డారు. చేగువేరా విప్లవం కోసం బతికారన్నారు. మోడీ, చేగువేరాలు ఎలా ఒక్కటవుతారని పవన్ను నారాయణ ప్రశ్నించారు.
మోడీని పవన్ కలవడాన్ని చేగువేరా చూసి ఉంటే చచ్చిపోయేవారన్నారు. బిజెపితో టిడిపి కలిస్తే సర్వనాశనమే అన్నారు. చంద్రబాబు నిప్పుతో చెలగాడమాడవద్దని నారాయణ హెచ్చరించారు. నాగార్జున తన వ్యాపారాల కోసం మోడీని కలిశారన్నారు. తమకు కాంగ్రెసు పార్టీ ఇస్తామని చెప్పిన సీట్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాంగ్రెసు ఇస్తామని చెబుతున్న సీట్లపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. తాను ఖమ్మం లోకసభకు దరఖాస్తు చేయలేదని చెప్పారు. తమకు అనుకూలంగా ఉండేచోట పోటీ చేస్తామన్నారు. వీలైనంత ఎక్కువ మందిని చట్టసభల్లోకి పంపాలని తాము చూస్తున్నామన్నారు.
సిపిఐ, కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు
మరోవైపు కాంగ్రెసు, సిపిఐల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. సిపిఐకి ఒక లోకసభ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెసు అంగీకరించింది. దీంతో ఖమ్మం లోకసభ స్థానం నుండి నారాయణ పోటీ దాదాపు ఖరారైంది. ఖమ్మం లోకసభతో పాటు మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, పినపాక, దేవరకొండ, స్టేషన్ ఘనపూర్, మహేశ్వరం, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గాలు సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెసు సుముఖంగా ఉందట.