వాయిదా: నారాయణ-జివోఎం మధ్య టిపై ఆసక్తికర చర్చ
హైదరాబాద్: తెలంగాణను ఎన్నికల తర్వాత చూద్దామంటే ఏమవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు జైరామ్ రమేష్ ప్రశ్నించారు! నాలుగు రోజుల క్రితం అఖిల పక్ష సమావేశంలో జివోఎంతో జరిగిన భేటీ అంశాలను నారాయణ తెలిపారు. విభజన అంశంపై మాత్రమే కాకుండా రకరకాల విషయాలపై మంత్రుల బృందంతో సిపిఐ బృందం చర్చ నడిచింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విశేషాలున్నాయి.
విభజనకు ఇప్పుడు సమయం లేదని, ఎన్నికల తర్వాత చూద్దామంటే ఏమవుతుందని జైరాం పేర్కొనగా రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు నష్టపోతుందని నారాయణ వారికి చెప్పారట.

మీరు సొంతంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి నెగ్గిస్తారా లేక బిజెపిపై ఆధారపడతారా, ఏవో సాంకేతిక కారణాలు చూపి బిల్లుకు ఆ పార్టీ మద్దతు తెలుపకతే మీ వ్యూహం ఏమిటని నారాయణ జివోఎం సభ్యులను ప్రశ్నించారు. దానికి వారు తెలంగాణ బిల్లుకు అనుకూలమని బిజెపి తమకు చెప్పిందని, అనుమానించాల్సిన అవసరం లేదని తెలిపారు. బిజెపి బిల్లుకు అనుకూలమని చెబుతూనే చివర్లో రాజకీయ, సాంకేతికంగా మెలిక పెట్టినా బిల్లు నెగ్గించుకునే విధానం ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆంటోని.. అదంతా తమకొదిలేయాలని, తాము చూసుకుంటామని చెప్పారు.
మాటల్లో త్వరలో అంటూనే, ఆచరణలో కాలయాపన చేస్తారన్నదే తమ అనుమానమని, కాలవ్యవధి తక్కువగా ఉందని, ఎన్నికల తరువాత చూద్దాం అంటారేమోనని నారాయణ అనగా... అలా జరిగితే ఏమవుతుందని జైరాం ప్రశ్నించారు.
దానికి నారాయణ స్పందిస్తూ.. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా కొట్టుకుపోతుందని, దానికన్నా మించి రాష్ట్రంలో అన్ని రకాల సంక్షోభం నెలకొంటుందని, దీన్ని అధిగమించడం సాధ్యం కాదని చెప్పారు.
కొత్త రాజధాని పైన జైరాం ప్రశ్నించగా.. రాయలసీమ - కోస్తా జిల్లాలను సమన్వయపరిచే ప్రాంతాన్ని ఆలోచించడం మంచిదని, విజయవాడ నుంచి ప్రకాశం వరకు ఆలోచించవచ్చునని నారాయణ సూచించారు. గుంటూరు విషయం జివోఎం అడగింది.
సిపిఐ, సిపిఎం మధ్య అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, ఆర్థిక, లౌకిక అంశాలలో ఏకాభిప్రాయం ఉందని, తెలంగాణ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయని వారు ప్రశ్నించారు. మావి రెండు వేర్వేరు పార్టీలు కాబట్టి కొన్ని అంశాలలో విభేదాలుంటాయని, 1969, 1972లలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర ఉద్యమాల ఉద్రిక్తతలలో కూడా తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని, కాలక్రమేణా ఒప్పందాల అమలులో ప్రభుత్వాలు చేసిన తప్పులకు ప్రజలు విసిగిపోయారని, సిపిఐ నుంచి 2000 సంవత్సరంలో మేం కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచినా ఖాతరు చేయలేదని చెప్పారు. వీటన్నింటి ఫలితంగానే రాజకీయ పరిష్కారంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా విధానాలు మార్చుకున్నామన్నారు.
వివిధ అంశాలపై మీ స్థాయి నుంచే లీకేజీలిస్తున్నారని, వాటిపై రాష్ట్రంలో వాదోపవాదాలకు దిగి వాతావరణం వేడెక్కిస్తున్నారని, తాము రాష్ట్రాన్ని విడదీయాలని కోరితే మీరేమో తెలుగు ప్రజలను విడదీస్తున్నారని నారాయణ అన్నారు. దానికి మంత్రుల బృందం ఏమీ మాట్లాడలేదు.
అనంతరం బాగున్నారు కదా అని జైరాం రమేష్ తెలుగులో అన్నారు. మా రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మీరే ఎక్కువ కసరత్తు చేస్తున్నట్లు తెలిసిందని, థ్యాంక్స్ అని నారాయణ చెప్పారు. ఆజాద్ మాట్లాడుతూ... మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారని హైకమాండ్ వద్ద ఆయన ప్రాధాన్యం తగ్గిందని చెప్పారు.












Click it and Unblock the Notifications