'రాజధాని' ఆగదు, జగన్ కుట్రనే: సాక్షి పత్రికపై నారాయణ నిప్పులు
విజయవాడ: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం తథ్యమని మంత్రి నారాయణ బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు పదేపదే రాజధాని రైతులను రెచ్చగొట్టడం తగదన్నారు.
రాజధానిలోని ఆరు గ్రామాల్లో వెయ్యి ఇళ్లు తొలగిస్తామన్నారు. అయితే బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. దానిపై ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ తుది నివేదిక ఇస్తారన్నారు. కలెక్టర్ నివేదిక ఇచ్చాక ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.
తాను అనని వ్యాఖ్యలను అన్నానని చెబుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తుని ఘటనలో టిడిపి పాత్ర ఉందని సాక్షి పత్రికలో రాయడం జగన్ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. తుని ఘటనకు వైసిపిదే పూర్తి బాధ్యత అన్నారు. టిడిపిలో వర్గాలు లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ప్రారంభమైంది. కాపులకు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని జస్టిస్ మంజునాథ కమిషన్కు సూచించేలా సమావేశంలో తీర్మానించే అవకాశముంది.
జస్టిస్ మంజునాథ కమిషన్ విధివిధానాలపై, కాపు కార్పొరేషన్కు రూ.2వేల కోట్లు కేటాయింపు డిమాండ్పై, పోలవరం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చేపట్టాల్సిన చర్యలు, శాసనసభ బడ్జెట్ సమావేశాలు, తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయాలు తీసుకోవచ్చు. తొలిసారిగా మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎస్ టక్కర్ పాల్గొన్నారు.