చంద్రబాబు, లోకేష్ పై సోషల్ మీడియాలో సెటైర్లేశాడు.. అరెస్టయ్యాడు
సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఏపీ పోలీసులు ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
పొలిటిక్ పంచ్ పేరుతో సోషల్ మీడియాలో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న ఇంటూరి రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ లోని శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడి అరెస్టుపై రవికిరణ్ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు.
ఈ ఘటనపై రవికిరణ్ భార్య సుజన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు అరెస్టు చేశారని, తమకు ఎలాంటి సమాచారం అందించలేదని, తన భర్తను వారు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సోషల్ మీడియాతోపాటు వెబ్ సైట్లలో ఏపీ ప్రభుత్వంపై, టీడీపీపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ క్యాంపెయినింగ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు.
అంతేకాదు, సామాజిక మాధ్యమాలను కట్టడి చేసే దిశగా ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునే అన్ని అవకాశాలను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లోని కొన్ని పేజీలు, మరికొన్ని వెబ్ సైట్లపై ప్రధానం ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఇప్పటికే ఓ బృందం సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం.