వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..
నెల్లూరులో మాఫియా ముఠా ఆగడాలు అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆనం కామెంట్లపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. పార్టీ లైన్ దాటొద్దని విజయసాయిరెడ్డి కూడా హెచ్చరించారు. గీత దాటితే వేటు తప్పదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.

ఇదీ విషయం
నెల్లూరులో శాంతి భద్రతలు లోపించాయని, ఇందుకు కారణం మాఫియా రెచ్చిపోవడమేనని ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం వ్యాఖ్యానించారు. పరోక్షంగా మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నెల్లూరులో వ్యవస్థలు తమ పని తాము చేసుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. మాఫియా ఆగడాలు శృతిమించడంతో వ్యవస్థలు పనిచేయని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి ఆగడాల గురించి ఎవరికీ చెప్పాలో తెలియక నగరవాసులు కుమలిపోతున్నారని పేర్కొన్నారు.

విచారణ జరిపిస్తాం..
ఆనం కామెంట్లపై వైసీపీ నేతలు ధీటుగానే స్పందించారు. నగరంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని తేల్చిచెప్పారు. ఆనం చేసిన వ్యాఖ్యలపై ఆయననే వివరణ అడగాలని మంత్రి అనిల్ కుమార్ సూచించారు. ఆ కామెంట్లపై తామేమి మాట్లాడమని చెప్పారు.

జగన్ మాటే..
ఆనం వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ ఆదేశాలను ఎవరూ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వ్యక్తిగత ఎజెండాను పార్టీ లైన్లో మాట్లాడొద్దని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, గీత దాటితే చర్యలు తప్పదని తేల్చిచెప్పారు.

మీడియాముఖంగా..
పార్టీలో జగన్ మాటే ఫైనల్ అని తేల్చిచెప్పారు. పార్టీలో ఏమైనా సమస్య ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కానీ బహిరంగంగా ఆరోపణలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాముఖంగా కామెంట్లు చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications