పవన్ కోసం కాలినడకన.. నెల్లూరు వర్సిటీ సమస్యలపై జనసేనాని ఫోకస్
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తక్షణం వర్సిటీ సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
హైదరాబాద్: ఆక్వా బాధితులు.. చేనేత కార్మికులు.. ఇప్పుడు విద్యార్థులు.. తమ సమస్యలపై గొంతెత్తడానికి పవన్ కళ్యాణే సరైన వ్యక్తి అని చాలామంది జనం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు విక్రమ సింహపురి విద్యార్థులు జనసేన అధ్యక్షుడు పవన్ ను కలిసి తమ సమస్యల గురించి వివరించారు.
ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో కాటమరాయుడు షూటింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ ను వర్సిటీ విద్యార్థులు అక్కడికెళ్లి కలిశారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ అలసత్వంపై పవన్ కు వారు విన్నవించారు. కాగా, పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వర్సిటీ విద్యార్థులు నెల్లూరు నుంచి కాలినడకన రావడం గమనార్హం.
కాగా, కాలినడకన వచ్చిన విద్యార్థుల్లో పలువురు విజయవాడలో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. విద్యార్థుల ఆవేదనపై పవన్ స్పందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను విజయవాడ నుంచి హైదరాబాద్ కు తీసుకురావాల్సిందిగా సూచించినట్లు సమాచారం.
విద్యార్థులు చెప్పిన సమస్యలు, అక్రమాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తక్షణం ఈ సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కరానికి తనవంతుగా సాధ్యమైనంత మేర కృషి చేస్తానని విద్యార్థులకు పవన్ భరోసా ఇచ్చారు.