మండలికి కొత్త ఛైర్మన్- డిప్యూటీ ఎన్నిక-పేర్లు ఖరారు : వచ్చే నెల రెండో వారంలో ఏపీ అసెంబ్లీ ..!!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు సమావేశాలు కరోనా కారణంగా కుదించారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు సైతం నిర్వహణకు సాధ్యపడలేదు. దీంతో..పాటుగా అసెంబ్లీ నిర్వహించి ఆరు నెలల సమయం ముగుస్తుండటంతో...ఒక్క రోజు సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలోనే 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటుగా.. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు.

వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ..
అయితే, వర్షాకాల సమావేశాలను ఈ నెలలోనే నిర్వహించాలని భావించినా..పూర్తిగా కరోనా తగ్గకపోవటంతో వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం తమ నిర్ణయాలు..పధకాల అమలు తీరును ఈ సమావేశాల ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆమోదించిన దిశ బిల్లు ఆమోదానికి కేంద్రం కొన్ని మార్పులు సూచించింది. దీంతో..ఈ బిల్లులో తగిన మార్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపనుంది.

అన్ని అంశాలకు సమాధానం..
ఇదే సమయంలో రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిగా దీని పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా పోలవరం సవరించిన అంచనాలకు వీలుగా చర్చ చేపట్టి..తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇక, శాసన మండలిలో క్రమేణా సంఖ్యా బలం పెరుగుతున్న సమయంలో మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ ను ఖరారు చేయనున్నారు. అదే విధంగా శాసనమండలి ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించిన షరీఫ్ - రెడ్డి సుబ్రమణ్యం పదవీ విరమణ చేసారు.

మండలిలో కొత్త ఛైర్మన్ - డిప్యూటీ..
వీరి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి నూతన ఛైర్మన్- డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ గా టీచర్ల ఎమ్మెల్సీ బాల సుబ్రమణ్యం వ్యవహరిస్తున్నారు. సమావేశాల తొలి రోజున మండలిలో కొత్త ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే వైసీపీ నుండి సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్..ఈ పదవుల విషయం లోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మండలి ఛైర్మన్ గా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తాజాగా గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కొయ్య మోషేన్ రాజు ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

మోషేన్ రాజు- జంగా క్రిష్ణమూర్తికి ఛాన్స్..
శాసనసభలో బీసీ వర్గానికి చెందిన నేతకు స్పీకర్ పదవి ఇవ్వటంతో..మండలిలో ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు పేరు ఖరారు చేసినట్లు సమాచారం. జగన్ పార్టీ ప్రకటన తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా మోషేన్ రాజు గుర్తింపు పొందారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసారు. ఇక, డిప్యూటీ ఛైర్మన్ ను బీసీ వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ గా ఉన్న జంగా క్రిష్ణమూర్తి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం జరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల ముందు నుంచే బీసీ వర్గాలకు సంబంధించిన వ్యవహారాలు..బీసీ సబ్ ప్లాన్ అంశాల్లో ఏర్పాటు చేసిన కమిటీలకు జంగా ఛైర్మన్ గా వ్యవహరించారు. ఈ సమావేశాల్లోనే వీరిద్దరి ఎంపిక జరగనుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన అధికారికంగా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications