చిరంజీవి-బాలయ్య-ప్రకాశ్ రాజ్: కేసీఆర్ ను మెప్పించేదెవరు : "మా" లో తొలి విజయం ఎవరిది..!!
"మా" లో ఎన్నికల పేరుతో ఇప్పుడు విభజన రేఖ కనిపిస్తోంది. తామంతా ఒకటే అని చెబుతున్నా...లోలోపల మాత్రం ఎవరికి కావాల్సిన వారికి మద్దతుగా పావులు కదులుతున్నాయి. ఇప్పుడు "మా" ఎన్నికల్లో అయిదుగురు పోటీలో ఉన్నా...ఒక విధంగా ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ఈ వివాదం మాత్రం మరింత కాలం కొనసాగటం మంచిది కాదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే, ఇప్పుడు "మా" ఎన్నికల్లో ఈ దఫా తొలి రోజు నుంచి చర్చకు వస్తున్న అంశం "మా" బిల్డింగ్.

నాగబాబు-విష్ణు వ్యాఖ్యలతో ప్రాముఖ్యత..
మెగా హీరో నాగబాబు...మంచు విష్ణు "మా" బిల్డింగ్ గురించి చేసిన వ్యాఖ్యలతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన విష్ణు చాలా లౌక్యంగా వ్యవహరిస్తూ..పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే.. "మా" బిల్డింగ్ మొత్తం తామే కడతామంటూ ముందుకొచ్చారు. పూర్తి ఖర్చు తానే భరిస్తానని వెల్లడించారు. కానీ, అంతకు ముందు నాగబాబు చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇవ్వటానికే విష్ణు బిల్డింగ్ భారం భరించటానికి ముందుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రకాశ్ రాజ్ సాధించగలరంటూ..
ఒక ఇంటర్వ్యూలో నాగబాబు గతంలో 'మా' బిల్డింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ భవన నిర్మాణానికి స్థలం కోసం ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఆ తర్వాత సీఎం వైఎస్ను ఎకరం భూమి ఇవ్వాలని మురళీమోహన్ కోరారని... కాంగ్రెస్ ప్రభుత్వం గేట్స్ క్లోజ్ చేసిందని వివరించారు. దాంతో రెండు ప్రయత్నాలు సఫలం కాలేదని చెప్పారు. మురళీ మోహన్ అప్పట్టో గట్టిగా ప్రయత్నం చేసుంటే 'మా'కు భవనం వచ్చేదని అభిప్రాయ పడ్డారు. ప్రకాష్రాజ్కు దక్షిణాదిన అన్ని ప్రభుత్వాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.

తాను సైతం అంటున్న విష్ణు..
విష్ణు సైతం తాజాగా.. తనకు ఉండే పలుకుబడి తనకూ ఉంటుందనే విషయాన్ని గుర్తించాలంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే, ఇప్పుడు 'మా' భవనం నిర్మాణానికి ముందుగా ప్రభుత్వం స్థలం కేటాయించాలి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు-వైఎస్సార్ సమయంలో 'మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్ స్థలం కేటాయింపు కోసం ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేదు. ఇక, ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈ ప్రతిపాదన రాలేదని చెబుతున్నారు.

మెగాస్టార్ ఓపెన్ గా ముందుకు రాగలరా..
మెగాస్టార్ చిరంజీవి సిని పరిశ్రమ సమస్యల పైన రెండు- మూడు సందర్భాల్లో కొందరు సినీ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. అదే విధంగా ఏపీ సీఎం జగన్ తోనూ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే బాలయ్యను కలుపుకోక పోవటం పైన చర్చ జరిగింది. దీని పైన కొద్ది రోజుల క్రితం బాలయ్య సైతం ఇప్పటి వరకు 'మా' బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు.
Recommended Video


విష్ణుకు మద్దతుగా బాలయ్య..
విష్ణు కు ఇప్పుడు బాలయ్య మద్దతు కనిపిస్తోంది. అయితే, ఇప్పుడున్న 'మా' ప్రత్యేక పరిస్థితుల్లో చిరంజీవి ఎంత వరకు ఓపెన్ గా ముందుకొచ్చి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి..బిల్డింగ్ స్థలం గురించి ప్రస్తావిస్తారనేది ఇప్పటికిప్పుడే చెప్పలేని అంశం. అదే విధంగా.. బాలయ్య అందుకు సిద్దపడి విష్ణుతో కలిసి ముందుగా అడుగులు వేసినా.. ఇతరులను సైతం కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే అది మరో వివాదం అవుతుంది.
ఇక, నాగబాబు చెప్పినట్లుగా ప్రకాశ్ రాజ్ నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసి..ఒప్పింగచలరా అంటే... ప్రస్తుతం 'మా' లో జరుగుతన్న పరిణామాలతో సీఎం ఎటువంటి సూచనలు చేస్తారనేది ఆసక్తి కరమే. దీంతో..మొత్తంగా ఇప్పుడు 'మా' ఎన్నికల వ్యవహారంలో సీఎం కేసీఆర్ ను స్థలం ఇచ్చేలా మెప్పింగలిగిన వారిదే 'మా' లో తొలి విజయం కానుందనే చర్చ జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications