చంద్రబాబుకు కొత్త కాన్వాయ్: బెజవాడలో బిజీ బిజీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం కొత్త కాన్వాయ్ను అమర్చింది. రెండు బుల్లెట్ ప్రూఫ్ ప్రాడో వాహనాలతో పాటు, ఆరు ఫార్చునర్ కార్లతో బాబు వాహనశ్రేణి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ చేసిన నాలుగు ప్రాడో వాహనాలు ఈ మధ్యే ప్రభుత్వానికి అందాయి. అందులో రెండు ప్రాడో వాహనాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుని మరో రెండింటిని ఏపీకి ఇచ్చింది. ఈ కాన్వాయ్ హైదరాబాద్లోనే ఉంటుంది.
విజయవాడ కోసం రెండు మూడు రోజుల్లో మరో కాన్వాయ్ను సిద్ధం చేయనున్నారు. కాగా, బుధవారంనాడు చంద్రబాబు విజయవాడలో బిజీగా గడిపారు. కృష్ణా జిల్లాలో 60వ జాతీయ బాల్ బాడ్మింటర్ టోర్నీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
నూతన రాష్ట్రమైన క్రీడాకారులకు కొరత లేని ప్రాంతం ఏపీ అని ఆయన అన్నారు. బాల్బాడ్మింటన్ అంటే గుర్తుకు వచ్చే వ్యక్తి పిచ్చయ్య అని, ఈ క్రీడ కోసం ఆయన నిరంతరం కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ నెల 27 వరకు జరిగే పోటీల్లో పలు రాష్ర్టాల క్రీడాకారులు పాల్గొననున్నారు.
అదలావుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బుధవారం నగరంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు. మంత్రులు, పలుశాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, కమిషనర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. నూతన రాష్ర్టాలనికి తొలి బడ్జెట్ను రూపొందిస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాల్సన బాధ్యత తమపై ఉందని బాబు తెలిపారు. మనం చేసే పనుల వల్లే ప్రజల కష్టాలు తీరాలని సమావేశంలో చంద్రబాబు చెప్పారు.