టీడీపీకి విశాఖ మేయర్ పదవి - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీలు కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విశాఖలో ఇప్పటి వరకు వైసీపీ పట్టు కొనసాగింది. తాజా ఎన్నికల ఫలితాల తరువాత విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పైన కూటమి పట్టు సాధించింది. వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరటంతో ఇప్పుడు మేయర్ పదవి కూటమికి దక్కనుంది. ఇదే సమయంలో ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుటోంది.
కీలక పరిణామాలు
విశాఖ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నగర మేయర్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అవసరమైతే అందుకు చట్ట సవరణకు రంగం సిద్దం అవుతోంది. 98 డివిజనల్లు ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే.. టీడీపీకి 29 మంది, జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు, సీపీఎం, సిపిఐలకి ఒక్కొక్కరు, స్వతంత్ర కార్పొరేటర్ల నలుగురు ఉన్నారు. కొద్ది రోజులుగా వైసీపీ కార్పొరేటర్లు వరుసగా టీడీపీ, జనసేన బాట పడుతున్నారు.

మేయర్ పదవి ఖాయం
ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లలో ఏడుగురు టీడీపీలో చేరితే.. జనసేన పార్టీలో ఐదుగురు చేరారు. కార్పొరేటర్ల పార్టీ మారే విషయాన్ని ముందుగానే గమనించిన జగన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దింపి చర్చలు జరిపించారు. అయితే గుడివాడ అమర్నాథ్ ఎంత బతిమలాడినప్పటికీ 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 50 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. జాయిన్ అయినా కొత్త కార్పొరేటర్లతో కలిపి ప్రస్తుతం కూటమి పార్టీలకు 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
చట్ట సవరణ
స్వతంత్రులు, కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్లతో పనిలేకుండానే కూటమికి విశాఖ కౌన్సిల్లో అవసరమైన బలముంది. కోఆప్షన్ మెంబర్లుగా ఉండే గ్రేటర్ విశాఖ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు విశాఖ, అనకాపల్లి ఎంపీలతో కలిపితే కూటమికి 54 ఓట్లు వస్తాయి. దాంతో సునాయాసంగా మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మేయర్గా ఎన్నికైన వారిపై నాలుగు సంవత్సరాలు పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదనే చట్టం అమల్లో ఉంది. ఇప్పుడు ఆ నిబంధన సవరించి మేయర్ పీఠం దక్కించుకోవటం కోసం కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications