జగన్ నయా రాజకీయం: ప్రభుత్వ స్కీములకు మోడీ పేరు,టార్గెట్ చంద్రబాబు పవన్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయంగా అడుగులు చాలా వ్యూహాత్మకంగా వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలుపై పలు విమర్శలు వచ్చాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న అవకాశం వచ్చినా జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఓ వైపు ఎవరెన్ని చెప్పినప్పటికీ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని వైసీపీ అధినేత భావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జగన్ నయా రాజకీయానికి తెరతీయనున్నట్లు సమాచారం. ఇంతకీ జగన్ వేస్తున్న వ్యూహాత్మక రాజకీయ అడుగులు ఏమిటి..? అది వర్కౌట్ అవుతుందా..?
జనసేనకు మరో నేత గుడ్ బై..వైసీపీలోకి ఎంట్రీ: కాపు నేతలకు జగన్ వల: పవన్ ను అక్కడే దెబ్బ కొట్టే స్కెచ్.
ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రతి సంక్షేమ పథకంపై లోపాలను వెతికి మరీ టార్గెట్ చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఏపీలో కరెంటు కోతలపై టీడీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అదే సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో కూడా పారదర్శకత లోపించిందని టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇక ట్విటర్ వేదికగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్లు ప్రతి రోజూ విమర్శిస్తూనే ఉన్నారు. టీడీపీ విమర్శలను జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతోందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ జగన్ కొత్త రాజకీయానికి తెరతీయనున్నట్లు సమాచారం.
చాణక్యతను ప్రదర్శించనున్న జగన్
2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలనన్నిటినీ పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది వైసీపీ. అందులో ఒకటి వైయస్సార్ రైతు భరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు రూ.12500 ఇస్తామని జగన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అయితే ఇది కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి కింద ఇస్తామన్న రూ. 6వేలతో కలిపి ఏపీ ప్రభుత్వం రూ.6500 వేసి మొత్తంగా రూ.12500 ఇవ్వడం జరుగుతుంది. పీఎం - కిసాన్ కింద నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడే సీఎం జగన్ తన చాణక్యాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.
జగన్ స్కెచ్ ఎలా ఉండబోతోంది..?
ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ ఢిల్లీలో శనివారం కలవనున్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అదే సమయంలో వైయస్సార్ రైతు భరోసా పేరును వైయస్సార్ మోడీ రైతు భరోసాగా పేరు పెట్టాలని ప్రధానితో చెప్పనున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం జగన్ చేయనున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి పలు పథకాలకు నిధులు వచ్చినప్పటికీ, ఆ పథకాల పేర్లకు ఎక్కడా బీజేపీ రంగు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అప్పటి సీఎం చంద్రబాబు. దీనిపై బీజేపీ పదే పదే ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చంద్రన్న బీమా లాంటి పథకం. నిధులు కేంద్రం నుంచి వచ్చాయని పేరు మాత్రం చంద్రన్న అని ఎలా పెడతారంటూ అప్పట్లో రాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది.
వైయస్సార్-మోడీ రైతు భరోసా పథకం
ఇక ఏపీ సీఎం జగన్ అలాంటి ప్రశ్నలకు తావు ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే వైయస్సార్ రైతు భరోసా పథకంకు వైయస్సార్ - మోడీ రైతు పథకంగా పేరు మార్చాలని డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని శనివారం మోడీని కలిసిన సమయంలో ఆయనతో చెప్పనున్నట్లు సమాచారం. అయితే మోడీ ఇందుకు అంగీకరిస్తారా అనేదానిపైనే ఈక్వేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఒక వేళ మోడీ ఒప్పుకుంటే ఆ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయనే అభిప్రాయాన్ని రాజకీయ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు చెక్ పెట్టేందుకే..!
జగన్ కొత్త రాజకీయ ఎత్తుగడ వేసి ఇటు టీడీపీని అటు జనసేనకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు బీజేపీకి దగ్గర అయ్యేందుకు పావులు కదుపుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వైయస్సార్ మోడీ పథకం పేరుకు ప్రధాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే జగన్ సక్సెస్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు జగన్ తనకు తానుగా ఇనిషియేటివ్ తీసుకుని ప్రధాని ముందుకు ఈ పేరుతో వస్తున్నారు కాబట్టి అక్కడ తన నిజాయితీ ఏంటో తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేకుండా పోతుందనే ఒపీనియన్ వ్యక్తమవుతోంది. అయితే ప్రధాని మోడీ ఇందుకు అంగీకరిస్తారా లేదా అనే అంశం పక్కనబెడితే జగన్ ప్రయత్నం మెచ్చుకుని తీరాల్సిందే అని విశ్లేషకులు చెబుతున్నారు. నిజాయితీతో మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఇది దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి సీఎం జగన్ శనివారం ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పుట్టెడు కష్టాలతో రాష్ట్రంలో పాలనను నెట్టుకొస్తున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర హామీలు ఏమేరకు సాధించుకుని వస్తారనేదానిపైనే అందరి దృష్టి ఉంది.