దేశవ్యాప్తంగా రైలు టికెట్ల బుకింగ్లో కొత్త నిబంధనలు
దేశవ్యాప్తంగా రైలు టికెట్లు తీసుకునేవారికి పాత నిబంధనలే కొత్తగా అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి ఇవి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ వీటి అమల్లో మాత్రం అధికారులు జాప్యం చేయడం జరుగుతోంది. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునేవారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టు వస్తుంది. అయినప్పటికీ ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుంది కదా అనే నమ్మకంతో చాలామంది వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుంటారు. ప్రయాణించే రోజుకు బెర్తు రానప్పటికీ రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు.
కిందకు దింపే అధికారం ఉంటుంది
వాస్తవానికి ఇలా ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతోపాటు అతన్ని కిందకు దింపే అధికారం కూడా ఉంటుంది. వెయిటింగ్ లిస్టు టికెట్ తో ఏసీ బోగీలో ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది. దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు. రైల్వే నుంచి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్టు టికెట్లపై ప్రయాణించే ఎంతోమందిపై ఈ ప్రభావం పడబోతోంది.

అధికారులకు లక్ష్యం
ఆన్ లైన్ లో తీసుకునే వెయిటింగ్ లిస్టు టికెట్లపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ నిబంధన కొన్ని దశాబ్దాల నుంచి అమలవుతోందని, అయితే ఎవరూ పాటించడంలేదన్నారు. ఇక నుంచి వెయిట్ లిస్టు టికెట్ తో రిజర్వుడు బోగీలో ప్రయాణిస్తే రూ.440 జరిమానా విధించబోతున్నారు. రైలు నుంచి దించడం లేదంటే జనరల్ బోగీకి పంపించే అధికారం టికెట్ కలెక్టర్ కు ఉంటుంది. అంతేకాకుండా చాలామంది జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగీలోకి ఎక్కుతారు. దీంతో ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు? ఎక్కడికి ప్రయాణిస్తున్నారనే విషయం కలెక్టర్లకు అర్థం కాకుండా ఉంటుంది. ఇకనుంచి టికెట్ కలెక్టర్లు తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటివారికి జరిమానా విధించి రైల్వేకు భారీ ఆదాయాన్ని తేవాలని రైల్వే బోర్డు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది.












Click it and Unblock the Notifications