ఎన్నికలకు ముందు కూడానా...: జగన్ నిర్ణయంపై వైసీపీ నాయకుల్లో కొత్త ఆందోళన!?
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల్లో, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో కొత్త ఆందోళన కనిపిస్తోందట. సభలో తమ గొంతు నొక్కుతున్నారని, అందుకే తాము సభకు హాజరు కావడం లేదని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈ అంశం ఆ పార్టీకి చెందిన నాయకుల్లో గుబులు పుట్టిస్తోందట.
'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసలైన వేదిక అసెంబ్లీ
ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు సరైన వేదికగా అసెంబ్లీయేనని అందరూ భావిస్తారు. అసలు, ప్రజలు ఓటు వేసి గెలిపించిందే నియోజకవర్గం ప్రతినిధిగా సభకు వెళ్లి ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అని గుర్తు చేస్తున్నారు. అధికార పక్షం సభలో గొంతు నొక్కుతుందనే వాదనలు కొత్తేమీ కాదు. ఏపీలోను అలాగే ఉన్నాయని, అయినంత మాత్రాన తమకు తామే సభకు వెళ్లకుండా ఉండటం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సభకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఫోన్లు చేస్తున్నట్లు కూడా స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు.
గొంతు నొక్కితే టీడీపీకే దెబ్బ
అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, 2019 ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు లెఫ్ట్ పార్టీ నేతలు కూడా.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకపోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సభకు రాకపోవడాన్ని టీడీపీ, జనసేనలు పదేపదే ప్రశ్నిస్తున్నాయి. సమస్యలను ప్రస్తావించేందుకు అదే అసలైన వేదిక అంటున్నారు. సభకు వెళ్లాక అధికార పక్షం గొంతు నొక్కితే.. అది టీడీపీకే మైనస్ అవుతుందని, కానీ వీరంతట వీరే సభకు హాజరు కాకపోవడం సరికాదని, అప్పుడు వైసీపీకే మైనస్ అవుతుందని అంటున్నారు.
టీడీపీకి ప్లస్ అవుతోంది
తాము సభకు హాజరయ్యే ప్రసక్తి లేదని, తమ పార్టీ నుంచి 2014లో గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు వెళ్లమని వైసీపీ భీష్మించుకు కూర్చుంది. అయితే, ఇదే అంశాన్ని సభలో లేవనెత్తవచ్చునని, అప్పుడు టీడీపీయే ఇరుకున పడుతుందని, ఒకవేళ గొంతు నొక్కితే అధికార పార్టీకి మైనస్ అవుతుందని, కానీ సభకు వెళ్లకపోవడం ద్వారా... చేజేతులారా టీడీపీకి నష్టం జరగకుండా వైసీపీ చర్యలు ఉన్నాయని, సమస్యను బయట లేవనెత్తడం కంటే సభలో లేవనెత్తడం ఎక్కువ ప్రభావం చూపుతుందని, గొంతు నొక్కితే అది వైసీపీకి లాభిస్తుందని అంటున్నారు. దాదాపు కేవలం అధికార పార్టీయే ఉండటం వల్ల సభ సాఫీగా సాగిపోతోందని అంటున్నారు.
వైసీపీ వెళ్లకుంటే వారికే మైనస్
కానీ, ఇవేమీ పట్టనట్లుగా వైసీపీ మాత్రం సభకు వెళ్లకపోవడం వారికే మైనస్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోను సభకు వెళ్లకపోవడం తమకు నష్టం చేస్తుందని వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ అసెంబ్లీకి వెళ్లిన సమయంలోను ప్రతిపక్షంగా సమర్థవంత పాత్ర పోషించిందనే అభిప్రాయాన్ని ఇతర పార్టీలు వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత సభకు వెళ్లడం మానేసింది.
లాభమా, నష్టమా ఎన్నికల్లో తేలుతుంది
అయితే, సభలో తమకు తమ గొంతు వినిపించే అవకాశం రావడం లేదని, అందుకే ప్రజల్లోకి వెళ్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లింది.. సభకు వెళ్లనందుకు లాభమా, నష్టమా అనే విషయం ఎన్నికల ఫలితాలు వచ్చాకే తేలుతాయని అంటున్నారు.