తిరుమల అన్నప్రసాదం నాణ్యతపై హామీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడం వల్ల భక్తులు తిరుమలకు పోటెత్తారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ భారీగా ఉంటోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ఆదివారం నాడు 69,870 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 42,119 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా ఆదాయం నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఫలితంగా క్యూలైన్లో భక్తులు వేచివుంటోన్నారు. బాట గంగమ్మ అమ్మవారి ఆలయం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. వారికి అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
కాగా- టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు బాధ్యతలను స్వీకరించారు. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఓ దంపతులకు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలను పలికారు. స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

బాధ్యతలను స్వీకరించిన రోజే శ్యామలరావు కార్యాచరణలోకి దిగారు. రాత్రి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. అక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
గతంలో టీటీడీ అన్న ప్రసాదంలో నాణ్యత లోపించిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్యామలరావు.. ఈఓగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే అన్నప్రసాద భవనాన్ని పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం ఆయన భక్తులతో ముచ్చటించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications