బోల్తా కొట్టిన టుడేస్ చాణక్య! టీడీపీకి 17 లోక్సభ సీట్లు అంటూ అంచనా! తీరా చూస్తే..?
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అవుతుందని చివరికి- ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి. జాతీయ స్థాయిలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 నుంచి 120 స్థానాలు మార్క్ చేశాయి. 18 నుంచి 22 వరకు లోక్సభ స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. న్యూస్ 24- టుడేస్ చాణక్య తెలుగుదేశం పార్టీని బాగా బూస్ట్ చేసి చూపించింది. 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 నుంచి 20 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది.
ఇప్పుడా ఫలితాలు తలకిందులయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 17 కాదు కదా కనీసం ఖాతా తెరవడం కూడా కష్టమౌతోంది. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉండగా.. అన్నింటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. తమ ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అందనంత దూరంలో ఉన్నారు. ప్రతి రౌండ్కు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు. చివరి రౌండ్ వరకు వచ్చే సరికి టీడీపీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవచ్చంటూ తెలుస్తోంది.
టీడీపీకి మూడు నుంచి అయిదు లోక్సభ స్థానాలు రావచ్చని మిగిలిన ఛానళ్ల సర్వేలు వెల్లడించాయి. వాటి అంచనా కూడా తప్పింది. అనూహ్యంగా 25 లోక్సభ స్థానాలను కూడా గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది వైఎస్ఆర్ సీపీ. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలే ఆ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టాయి. అభ్యర్థుల ఎంపిక ఆయన దాదాపు ప్రతి సామాజిక వర్గానికీ ప్రాతినిథ్యం కల్పించారు. చాలా చోట్ల సాధారణ వ్యక్తులను నిలబెట్టారు.
గోరంట్ల మాధవ్ (హిందూపురం), తలారి రంగయ్య (అనంతపురం), డాక్టర్ సంజయ్ కుమార్ (కర్నూలు), నందిగాం సురేష్ (బాపట్ల), గొడ్డేటి మాధవి (అరకు) వీరందరూ రాజకీయాలకు కొత్తే. అయినప్పటికీ.. వారికి ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ వ్యూహం ఫలించింది. ప్రస్తుతం వారంతా- గెలుపు రుచి చూడబోతున్నారు.