మాజీ జేడీకి బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు - వయా ఢిల్లీ..!?
బీఆర్ఎస్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ అక్కడ కంటే ఏపీలో ఎక్కువ సంచలనంగా మారుతోంది. ఈ పార్టీకి కార్యాలయంకు సంబంధించి ఇప్పటికే విజయవాడలో స్థలం ఖరారు చేసారు. ఏపీ ఇంఛార్జ్ బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. ఏపీ నుంచి రెండు పార్టీల్లో ఉన్న అయిదుగురు సీనియర్లతో ఇప్పటికే మంతనాలు జరిగాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఆసక్తని పెంచుతోంది. అదే సమయంలో ఏపీలో బీఆర్ఎస్ కొత్త పొత్తులతో రాజకీయ అడుగులు వేసేందుకు సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ అడగులు ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతాయనే చర్చ మొదలైంది.

ఏపీలో అయిదుగురు నేతలు సిద్దం..
బీఆర్ఎస్ పైన దాదాపు ఏడాది కాలంలో టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర లో ముందుగా పార్టీ విస్తరణ పైన ఇప్పటికే ఒక స్పష్టమైన అంచనాతో ఉన్నారు. ఇందు కోసం కలిసొచ్చే పార్టీలు.. మద్దతుగా నిలిచే నేతల పైన ఫోకస్ పెట్టారు. అందులో ఏపీ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండీ.. ప్రస్తుత పార్టీల్లో ఇమడలేక దూరంగా ఉన్న అయిదుగురు నేతలతో మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో వైఎస్సార్ హయాంలోనూ కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి..ఇప్పటికే మూడు పార్టీలు మారిన సీనియర్ నేత బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. అదే విధంగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ..మాజీ మంత్రిగా పని చేసిన సీనియర్ తో పాటుగా అదే జిల్లాకు చెందిన ప్రాంతీయ పార్టీ సీనియర్ కూడా బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత మద్దతుగా నిలుస్తున్నా..బాధ్యతల స్వీకరణకు సుముఖంగా లేరు. ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని పర్యవేక్షించనున్నట్లు సమాచారం.

ఏపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆఫర్..!?
ఏ పార్టీలో లేకపోయినా.. పొలిటికల్ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైపు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. జనసేన నుంచి 2019లో పోటీ చేసిన లక్ష్మీనారాయణ తిరిగి విశఆఖ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే, తన అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉంటానని చెబుతున్నారు. ఏపీలో ఆప్ కన్వీనర్ బాధ్యతలు లక్ష్మీనారాయణకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. లక్ష్మీనారాయణకు ఆసక్తి ఉంటే బీఆర్ఎస్ ఏపీ పగ్గాలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ లో చేరినా.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే గుజరాత్ ఎన్నికల తరువాత ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించింది. ఇక, ఏపీలో బీఆర్ఎస్ తో పొత్తు ద్వారా.. రెండు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేమైన ఏపీ లోని ప్రజానీకం ఆప్ తో కలవటం ద్వారా పాత గాయాలను మరిచి..మద్దతుగా నిలుస్తారనే బీఆర్ఎస్ అంచనా. అయితే, దీని పైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో త్వరలోనే ముఖ్యనేత చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఆప్ - బీఆర్ఎస్ పొత్తు తో జరిగేదేంటి
ఏపీలో ఇప్పుడు ప్రధాన పోటీ వైసీపీ వర్సస్ టీడీపీగా కనిపిస్తోంది. టీడీపీకి జనసేన మద్దతు పైన స్పష్టత రావాల్సి ఉంది. జనసేన మద్దతిస్తే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ వ్యవహారంలో స్పష్టత లేదు. ఇక, ఇప్పుడు బీఆర్ఎస్ - ఆప్ వంటి పార్టీలు ఏపీలో ఎంట్రీ ఇవ్వటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం కనిపిస్తోంది. ఏ మేర చీల్చుతాయనేది ఎన్నికల సమయంలోనే అంచనా రానుంది. అయితే, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో పెద్దగా ప్రయోజనం ఉండదనే విశ్లేషణలు ఉన్నాయి. ఆప్ తో కలిసి పోటీ చేయటం ద్వారా అర్బన్ - ఉద్యోగ- యువత ఓట్లు కొంత మేర రాబట్టే అవకాశం ఉంటుంది. ఈ ఓట్లు ప్రస్తుతం ఏపీలో టీడీపీ - బీజేపీ పార్టీలు ఆశలు పెట్టుకున్నవే. ఈ రెండు పార్టీల కారణంగా వైసీపీకి జరిగే నష్టం ఉండదనేది మరో వాదన. దీంతో, అసలు..ఈ కొత్త పార్టీలు ఏపీలో ఎంట్రీకి సంబంధించి వచ్చే నెలలో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications