వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం: ఏపీతోపాటు తమిళనాడులో భారీ వర్షాలు, అలర్ట్
అమరావతి: ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి.. తీవ్ర అల్ప పీడనంగా మారడంతో వర్షాలు కురవనున్నాయి.

వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం
కాగా, రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలివచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏపీతోపాటు తమిళనాడులో వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రలో నవంబర్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రా, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, రాయలసీమలలో ఆదివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 21, 22 తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
మరోవైపు, విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వర్షాలపై అప్రమత్తం చేసింది.
నైరుతి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకలోని జాఫ్నాకి తూర్పున 600 కి.మీ, తూర్పు ఆగ్నేయంగా కారైకాల్కు 630 కి.మీ, చెన్నైకి 670 కి.మీల దూరంలో కేంద్రీకృతమైవుంది. నెమ్మదిగా వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు - దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి
మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు
కాగా, వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు సన్నద్ధం కావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లవద్దని హెచ్చరించారు. కరెంట్ పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి నవంబర్ 20, 22 మధ్య గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, నవంబర్ 20 నుంచి 23 వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications