వ్యాక్సిన్ల పేర 11లక్షల మోసం: నైజిరీయన్ అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: డ్రగ్స్, జాబ్స్, లాటరీ మోసాలతో కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్లు ఇప్పుడు కొత్తరకం మోసానికి తెరలేపారు. జంతువులకు వేసే వ్యాక్సిన్లను తక్కువ ధరకే సరఫరా చేస్తామని నమ్మించి ఓ వ్యాపారకి సుమారు రూ. 11 లక్షలు మోసగించి సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను అదనపు డిసిపి జానకీ షర్మిల శుక్రవారం వెల్లడించారు.
నైజీరియా దేశానికి చెందిన ఇజ్రాయెల్ చిమెజి అలియాస్ టోనీ మాక్స్వెల్ ముంబైలోని వెస్ట్బంద్రలో ఉంటున్నాడు. ఇతడితో పాటు కెచుకుమా జాన్సన్ కలిసి గుర్తుతెలియని నంబర్తో నాచారానికి చెందిన ఎస్.వినోద్కుమార్ స్నేహితుడికి ఫోన్ చేశారు. అతడికి ఆంగ్లం రాకపోవడంతో ఆ ఫోన్ను వినోద్కుమార్ ఇచ్చి మాట్లాడించాడు. తమ కంపెనీ జంతువులకు వేసే వ్యాక్సిన్లను తయారు చేస్తోందని, వాటిలోకి నిరోటిక్ లిక్విడ్ అనే మందు అవసరమని, దాన్ని సరఫరా చేయాలని చెప్పారు. ఈ మందు ముంబైలోని రాజ్ ట్రేడింగ్ కంపెనీలో లభిస్తుందని చిరునామా చెప్పారు. దీనికి వినోద్కుమార్ అంగీకరించాడు.
రాజ్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అధినేత ఖుషిరాజ్ నంబర్ను అతడికిచ్చారు. వినోద్ ఆమెతో మాట్లాడి సరుకు వివరాలు తెలుసుకున్నాడు. లీటరు 10 లక్షల రూపాయలకు నిరోటిక్ లిక్విడ్ను కొనుగోలు చేయడానికి వినోద్ అంగీకరించాడు. తర్వాత దఫదఫాలుగా కొంత సరుకు కొనుగోలు చేయడానికి 10 లక్షల 92 వేల 500 రూపాయలను ఆన్లైన్లో చెల్లించాడు. ఫిబ్రవరి నెలలో నిందితులు ఘానా దేశానికి చెందిన కల్వరి జువాలజికల్ కంపెనీ ప్రతినిధిని వినోద్కుమార్ వద్దకు పంపారు. అతడు రెండు మిల్లీలీటర్ల లిక్విడ్ను పరీక్ష చేసుకుని వెళ్లిపోయాడు.

అతడు ముంబై చేరుకున్నాక వినోద్కు ఫోన్ చేసి తమ కంపెనీకి అత్యవసరంగా పది లీటర్ల లిక్విడ్ సరఫరా చేయాలని అడిగాడు. కోట్లు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో వినోద్ ఈ డీల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఖుషిరాజ్కు ఫోన్ చేసి తాను చెల్లించిన డబ్బులను వాపసు చేయాలని అడిగాడు. నష్టపరిహారంగా కొంత డబ్బు మినహాయించుకుని మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పిన ఖుషిరాజ్ మళ్లీ లక్షా 42 వేల 500 రూపాయలు ఖాతాల్లో వేయించుకుంది. తాను మోసపోయాననే విషయం ఆలస్యంగా తెలుసుకున్న వినోద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
దర్యాప్తును ప్రారంభించిన పోలీసు బృందాలు ముంబైలో ఉంటున్న టోనీ మ్యాక్స్వెల్ను అరెస్టు చేసి రెండు పాస్పోర్టులు, ల్యాప్టాప్, డెబిట్ కార్డులు, డేటా కార్డులు, రెండుఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాస్పోర్టులో ఒకటి నకిలీదని పోలీసులు నిర్ధారించారు. ఇతడికి సహకరించిన కెచుకుమా జాన్సన్, ఖుషిరాజ్ పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు రాబట్టడానికి టోనీమ్యాక్స్ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications