ఏపీలో నైట్ కర్ఫ్యూ.. మార్గదర్శకాలు విడుదల.. ఉల్లంఘిస్తే రూ. 25 వేలు ఫైన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూను విధించింది. ఈ కర్ఫ్యూ ఈనెల 31 వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది.

నైట్ కర్ఫ్యూ .. మార్గదర్శకాలు
కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ, మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఐటీ, పెట్రోల్ బంకులు, విద్యుత్, పారిశుధ్య సిబ్బందికి, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు చూపించి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర , రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు, కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించింది. వైరస్ నియంత్రణా చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమలులో లేని సమయంలో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్లో నిర్వహించే కార్యక్రమాలకు 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు ఫైన్ విధించనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేశారు.

మద్యం షాపుల పనివేళలు పెంపు
మరోవైపు మద్యం దుకాణాల పని వేళలను పెంచింది. ఇప్పటివరకు రాత్రి 9గంటల వరకు తెరిచి ఉండే దుకాణాలను రాత్రి 10 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు వర్తిస్తాయని తెలిపింది. అయితే వైన్ షాపుల పనివేళలు పెంచడంపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఏపీలో కరోనా కల్లోలం
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. సోమవారంతో పోలిస్తే ఈరోజు 2,888 పాజిటివ్ కేసులు పెరిగాయి.. విశాఖలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,066 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 21,14,489 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 20,63,867 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి 14,514 మంది మృతి చెందారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్క రోజులోనే కేసులు రెట్టింపు స్థాయిలో పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది..












Click it and Unblock the Notifications