ఏపీ, తెలంగాణ కలవడం అసాధ్యం: ఇలా చేస్తే కేసీఆర్కు పేరు, ప్రఖ్యాతలు, జగన్కు ఉండవల్లి సూచన
హైదరాబాద్/అమరావతి: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్రం, బీజేపీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేస్తారంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ, తెలంగాణ తిరిగి కలిసే అవకాశం లేదన్న ఉండవల్లి
విడిపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశమే లేదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. తెలుగు రాష్ట్రాలు కలిసిపోవడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టారు. లోక్సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఫిబ్రవరి 18నాటికి ఎనిమిదేళ్లు గడిచిపోయాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన, ఇతర రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు.

ఏపీకి న్యాయం చేసే బాధ్యతను కేసీఆర్ తీసుకోవాలన్న ఉండవల్లి
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన ఈ వ్యాఖ్యలను అనుకూలంగా మార్చుకోవాలని సీఎం వైఎస్ జగన్కు ఆయన సూచించారు. ఏపీకి న్యాయం చేసే బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటే.. ఆయనకు ఇంకా పేరు, ప్రఖ్యాతలు వస్తాయన్నారు ఉండవల్లి.

కాంగ్రెస్లా అమిత్ షా చేయలేదు: ఉండవల్లి
బ్లాక్ డే ఇన్ ది పార్లమెంట్ అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, పార్లమెంట్ కు చీకటి రోజు ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన రోజే అంటూ ఆయన వెల్లడించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కాశ్మీర్ విభజన జరుగుతున్న సమయంలో ఇది పద్ధతి కాదని కాంగ్రెస్ అంటే... గతంలోలాగా తలుపులు మూయలేదు.. తాము చర్చ చేస్తున్నామని అమిత్ షా సమాధానం ఇచ్చారన్నారు ఉండవల్లి. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా పాస్ చేస్తారని షా ప్రశ్నించారని తెలిపారు.

సుప్రీంను ఆశ్రయిస్తే.. చంద్రబాబు స్పందించలేదన్న ఉండవల్లి
ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగాలని తాను కోరడం జరిగిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించామని, గతంలో తాను సుప్రీంను ఆశ్రయించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించ లేదన్నారు. పార్లమెంట్లో పాసైన బిల్లును పంపితే రాష్ట్రపతి ఆమోదించి తీరాల్సి ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ తనకు తెలియచేయడం జరిగిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన రాజకీయ చర్చకు దారితీస్తాయో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications