కాపులకు నిరాశే?: పవన్ కాకినాడ సభలో రాని కాపు రిజర్వేషన్ ప్రస్తావన
అమరావతి: కాపు రిజర్వేషన్లపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతారంటూ ఎదురు చూసిన కాపులకు నిరాశే ఎదురైందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శుక్రవారం కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్స్లో జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో కాపుల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడతారనే ప్రచారం జరిగింది.
అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ నోట కాపు రిజర్వేషన్ల అంశమే ప్రస్తావనకు లేదు. దీంతో కాపు రిజర్వేషన్ పోరాటంపై నోరు విప్పకపోవడాన్ని కాపునాడు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. పవన్ కళ్యాణ్కు రాష్ట్ర జనాభాలో 27 శాతంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తుల సమస్య పట్టలేదా? అని ప్రశ్నించింది.

పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక సమస్యలను ప్రస్తావించారని, రాష్ట్రంలో కొన్నేళ్లుగా కాపును బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమిస్తున్నా, పవన్ మాత్రం కాపు రిజర్వేషన్లను మాత్రం పట్టించుకోలేదని మండిపడింది. కాపుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయన్నారు.
2014 ఎన్నికల్లో పవన్ మద్దతు ఇచ్చిన టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగే కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ జేఏసీల సమావేశంలో ఈ విషయాన్నీ చర్చిస్తామని కాపునాడు రాష్ట్ర కమిటీ పేర్కొంది.












Click it and Unblock the Notifications