గ్రేట్ ప్లేయర్, అంతే!: సానియాపై వెంకయ్య నో కామెంట్
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జాను నియమించుకోవడం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించేందుకు నిరాకరించారు. సానియాను అంబాసిడర్గా నియమించుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, దానిపై తాను స్పందించలేనని ఆయన స్పష్టం చేశారు.
అయితే, మనం తీసుకునే నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారనే దానిని మాత్రం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. సానియా గొప్ప క్రీడాకారిణి అని మాత్రం ఆయన అన్నారు. తెలంగాణకు ఎవరు పని చేస్తారనేది ప్రభుత్వమే నిర్ణయించుకుంటుందన్నారు.
ఇరురాష్ట్రాలు కలసి చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై రెండు రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తుంటారన్నారు. కాబట్టి పొరపాట్లకు తావులేకుండా పాలన సాగించాలన్నారు.
ఇచ్చిన హామీల పైన ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. మోడీ పాలనలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య లేదన్నారు. ఉద్యోగాల పంపిణీ పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అన్యాయం జరిగితే కమిటీకి చెప్పుకోవచ్చునని తెలిపారు. రుణమాఫీకి కేంద్రం ఎలాంటి సాయం చేయదని చెప్పారు. విద్యార్థులకు నష్టం జరగకుండా రెండు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.