స్పీకర్ కోడెలపై అవిశ్వాసం: జగన్ సంచలన నిర్ణయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.
స్పీకర్ పై తమకు నమ్మకం, గౌరవం పోయిందని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నిర్ణయించామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జలసంరక్షణపై ప్రతిజ్ఞ చేయడానికి ముందు తన వెనక నిల్చుని ఉన్న చీఫ్ విప్ శ్రీనివాసులతో 'ప్రతిజ్ఞ పూర్తయ్యాక సభను వాయిదా వేయించు' అని సూచించారని.. దీంతో శ్రీనివాసులు తల ఊపుతూ.. చేయి ఊపుతూ స్పీకర్కు సైగ చేశారని చెప్పారు.
సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను గురువారానికి వాయిదా వేశారని జగన్ చెప్పారు. ఇక గురువారం కూడా అగ్రిగోల్డ్ మీద చర్చతో మొదలైన సభ.. ఆ తర్వాత అసలు సభకు సంబంధం లేని విషయంలోకి తీసుకెళ్లడాన్ని జగన్ తప్పుబట్టారు. లక్షలాది మంది బాధితులు ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే దాన్ని సరిగా పట్టించుకోకుండా సాక్షి పత్రిక, ఛానల్ గురించి చర్చ మొదలుపెట్టారని అన్నారు.
సాక్షి మీద చర్యలు తీసుకోవాలని, ఎడిటర్ను సభకు పిలిపించాలని ఇలా రకరకాలుగా మాట్లాడారని అన్నారు. స్పీకర్ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఎక్కడో మొదలైన చర్చను.. ఎక్కడికో తీసుకెళ్లడంతో ఆయనపై అవిశ్వాసం తీర్మానం పెడతామని చెప్పారు. ఇక గురువారం నాడు సభలో బడ్జెట్ పద్దుల మీద ఎలాంటి తీర్మానం జరగలేదని అన్నారు.