విశాఖ బ్రాండ్ ఇమేజ్పై అపోహలే, చెదరదు: సిఎస్
హైదరాబాద్: తుఫాన్ల తాకిడి అధికంగా ఉండే విశాఖపట్నానికి వివిధ ప్రాంతాలు, సంస్థల నుంచి వచ్చే పెట్టుబడులు నిలిచిపోతాయనే ప్రచారం కేవలం అపోహేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలో తీర ప్రాంతాల్లో ఉన్న చాలా నగరాలు వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించాయని, విశాఖపట్నం కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా రూపొందుతుందని స్పష్టం చేశారు.
గురువారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మన దేశంలోని ముంబై నగరం అనేకసార్లు తుఫాన్ల తాకిడికి గురై దెబ్బతిన్నా, వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చే పెట్టుబడులు మాత్రం ఆగలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే విశాఖకు కూడా రాబోయే రోజుల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నారు. ప్రపంచంలో చైనా, జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు తుఫాన్ల ముప్పు ఉన్నా, అవి ఎంతగా అభివృద్ధి సాధించాయో మనం చూశామన్నారు.
పకృతి వైపరీత్యాల వల్ల విశాఖపట్నం అభివృద్ధి పరంగా వెనకబడుతుందని అనుకోవడం పొరపాటని ఆయన అన్నారు. తుఫాన్లు సహజంగా పల్లె ప్రాంతాల్లో తీరం తాకడం జరుగుతుందని, కానీ హుధుద్ నేరుగా విశాఖపట్నం వద్ద తీరందాటి నగరం మీదగా వెళ్లడంతో ఆస్తి నష్టం అధికంగా సంభవించిందన్నారు. 1896 నుంచి ఇప్పటి వరకూ 77 తుఫాన్లు వచ్చాయని, శతాబ్ద కాలంలో విశాఖపట్నాన్ని తాకింది మాత్రం హధుద్ ఒక్కటే అన్నారు.
తుఫాను వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఉండి సహాయ, పునరావాస పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. బాధితులకు మొదటి రెండు రోజులు ఆహార పదార్థాలు అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుందని, మూడో రోజు నుంచి బియ్యం, మంచినీరు, కూరగాయలు అందజేస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ 24 జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలో ఉండి ప్రజలకు సహయం చేస్తున్నాయన్నారు.
సైనిక బలగాలు పునరావాస చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని కృష్ణారావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. తుపాను తాకిడి ప్రాంతాల్లో 70 శాతం విద్యుత్తు స్తంభాలు పడిపోయాయని, తెలంగాణ, తమిళనాడు, ఒడిసా ప్రాంతాల నుంచి సహాయ బృందాలు వచ్చి పునరుద్ధరణ పనులు చేస్తున్నాయని వివరించారు. శుక్రవారం నాటికి విశాఖలో విద్యుత్తు పునరుద్ధరిస్తామని, శనివారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 44 మండలాల్లో పంటనష్టం తీవ్రంగా ఉందని, బాధితులకు సహాయం చేయడంలో లోటుపాట్లు రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.