రూపాయి చాక్లెట్ తెచ్చిన అదృష్టం.. ‘మెలోడీ’ గిఫ్ట్.. దలాల్ స్ట్రీట్ను షేక్
సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న మీమ్ (Meme) లేదా వీడియో.. స్టాక్ మార్కెట్లను ఏ స్థాయిలో శాసించగలదో చూపించే విచిత్రమైన సంఘటన దలాల్ స్ట్రీట్లో చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదంతో మార్కెట్లు కుప్పకూలుతున్నా.. ఒకే ఒక్క రూపాయి చాక్లెట్ పుణ్యమా అని ఒక నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ మరియు ఇన్వెస్టర్ల తొందరపాటు వల్ల జరిగింది.
వైరల్ వీడియో తెచ్చిన 'మెలోడీ' ట్రెండ్!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రోమ్లో జరిగిన అధికారిక భేటీపై సోషల్ మీడియా ఊహించిన విధంగానే స్పందించింది. వీరిద్దరి పేర్లను కలిపి నెటిజన్లు 'మెలోడి' (Melodi) పేరుతో మీమ్స్ ట్రెండ్ చేశారు. ఈ సరదాను అంతే సరదాగా స్వీకరించిన ప్రధాని మోదీ.. మెలోనికి పార్లే ప్రొడక్ట్స్ తయారుచేసే చాక్లెట్-కార్మెల్ క్యాండీ "మెలోడి" (Melody) టోఫీ ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
మే 20, 2026 మధ్యాహ్నం 2:19 గంటలకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ రీల్ వీడియోలో, మెలోని నవ్వుతూ "ప్రధానమంత్రి మోడీ ఒక మంచి టాఫీని బహుమతిగా తెచ్చారు" అని చెప్పారు. దీనికి బదులుగా ప్రధాని మోడీ అంతే నవ్వుతూ "మెలోడీ" అని సమాధానం ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది.

బాస్.. ఇక్కడే అసలు ట్విస్ట్! ఇన్వెస్టర్ల కన్ఫ్యూజన్!
ఈ వీడియో వైరల్ కావడం ఆలస్యం, మార్కెట్ ఇన్వెస్టర్లు, రిటైల్ వ్యాపారులు 'మెలోడీ చాక్లెట్ కంపెనీ' షేర్లు కొనేయాలనే ఆతురుతతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) టెర్మినల్స్ వద్దకు పరుగులు తీశారు. అక్కడ వారికి "పార్లే ఇండస్ట్రీస్" (Parle Industries) అనే పేరుతో ఒక కంపెనీ కనిపించింది. ఇంకేముంది.. 'మెలోడీ చాక్లెట్ పార్లే వాళ్లదే కదా' అని ఫిక్స్ అయిపోయి, కళ్ళు మూసుకుని ఆ షేర్లను భారీగా కొనుగోలు చేయడం ప్రారంభించారు.
గంట వ్యవధిలోనే పార్లే ఇండస్ట్రీస్ షేర్లు రూ.0.25 లాభంతో, రూ. 4.95 నుండి రూ. 5.25కు పెరిగి 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకాయి. గత 12 నెలల్లో సుమారు 68 శాతం నష్టపోయిన ఈ స్టాక్, ఒక్క వీడియోతో ఒక్కసారిగా దూసుకుపోయింది.
నిజానికి ఆ రెండు కంపెనీలకూ ఎలాంటి సంబంధం లేదు!
ఇన్వెస్టర్లు కొన్న 'పార్లే ఇండస్ట్రీస్' వేరు.. చాక్లెట్లు తయారు చేసే 'పార్లే ప్రొడక్ట్స్' వేరు. పేరులో ఉన్న పోలిక మినహా ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు.
పార్లే ప్రొడక్ట్స్:
మెలోడీ, పార్లే-జి, మొనాకో, క్రాక్జాక్, హైడ్ & సీక్ వంటి బ్రాండ్లను తయారుచేసే ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం. ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ. స్టాక్ మార్కెట్లో అస్సలు లిస్ట్ కాలేదు. కాబట్టి దీని షేర్లు కొనడం ఎవరికీ సాధ్యం కాదు.
పార్లే ఇండస్ట్రీస్:
1983లో ఎక్స్ప్రెస్ బాటిలర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్గా ప్రారంభమై, ఆ తర్వాత పేరు మార్చుకుంది. ఒకప్పుడు పార్లే-బిస్లరీ గ్రూప్ దీనిని ప్రమోట్ చేసినా.. ప్రస్తుతం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, పేపర్ వేస్ట్ రీసైక్లింగ్ వ్యాపారాలు చూసుకునే స్వతంత్ర సంస్థ. వీళ్లు బిస్కెట్లు కానీ, టాఫీలు కానీ తయారు చేయరు.
గిఫ్ట్ చాలా బాగుంది.. కానీ ఐపీఓ కి రాం: పార్లే ప్రొడక్ట్స్ క్లారిటీ
ఈ గందరగోళంపై పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా స్పందిస్తూ.. ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికపై భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. మెలోడీ టాఫీలు ఇప్పటికే 100 పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, మోడీ గారి సంజ్ఞతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతానికి తమ కంపెనీని స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేసే ఉద్దేశం ఏమీ లేదని, ప్రైవేట్ సంస్థగానే కొనసాగుతామని, ఐపీఓ (IPO) వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఏదేమైనా, ఎటువంటి వ్యాపార అప్డేట్స్ కానీ, కొత్త ఆర్డర్లు కానీ లేకుండా.. కేవలం ఒకే ఒక్క రూపాయి టాఫీ తెచ్చిన సోషల్ మీడియా క్రేజ్ కారణంగా పార్లే ఇండస్ట్రీస్ ఆ రోజుకు మార్కెట్లోనే అత్యంత 'మధురమైన' స్టాక్గా నిలవడం దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక విచిత్రమైన రికార్డనే చెప్పాలి!














Click it and Unblock the Notifications