తగ్గిన చంద్రబాబు కాన్వాయ్, ఏపీ అవతరణ దినోత్సవానికి స్వస్తి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు విజయవాడ వచ్చినప్పుడు ఆయనకు ఉన్న ప్రొటోకాల్ మేరకు కాన్వాయ్లో 23 వాహనాలను ఉంచారు.
అయితే, చంద్రబాబు విజయవాడలోనే ఉంటుండటం, కరకట్ట వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఆయన కాన్వాయ్ను 23 నుంచి తొమ్మిదికి తగ్గించారు. కాన్వాయ్ లోని అంబులెన్స్ను కూడా ఉపసంహరించే ఆలోచనలో ఉన్నారు.
చంద్రబాబు అస్వస్థతకు గురైతే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా వారధి అవతల ఉన్న మణిపాల్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఉన్నచోటు నుంచి ఈ ఆసుపత్రులకు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ కారణంగానే కాన్వాయ్లో అంబులెన్స్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు.
ఏపీ అవతరణ దినోత్సవానికి స్వస్తి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీని అధికారిక అవతరణ దినోత్సవంగా నిర్వహించే ఆనవాయితీకి చరమగీతం పాడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాటి చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా అవతరణ దినోత్సవాలు జరిపింది.
కానీ 23 జిల్లాల ఉమ్మడి ఏపీ నుంచి పది జిల్లాలతో కూడిన తెలంగాణ 2014 జూన్ రెండవ తేదీన ఆవిర్భవించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం మారలేదు. గత ఏడాది కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరిపే విషయమై చంద్రబాబు ఆసక్తి చూపించలేదు.