బెజవాడ ఓకే, కానీ: రాజధానిపై జగన్, బాబు కోరికలని..
హైదరాబాద్: విజయవాడను రాజధానిగా చేస్తే తనకు ఎటువంటి అభ్యతరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. అయితే, రాజధాని నిర్మించాలంటే 35 వేల ఎకరాల భూమి కచ్చితంగా అవసరమవుతుందన్నారు.
అంత భూమి విజయవాడలో లభ్యమవుతుందా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం విజయవాడలో 35 వేల ఎకరాల భూమిని సేకరించి రాజధానిని నిర్మిస్తే సమర్థనీయమేనన్నారు. బడ్జెట్లో రాజధాని నిర్మాణంపై ఆర్థిక మంత్రి ఎటువంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఏపీ మొదటి బడ్జెట్తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయన్నారు. తమతో పాటు అన్ని వర్గాలను ఈ బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. రైతులు తీవ్ర నిరాశపడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం ఎక్కడో, దానికి కేటాయింపులు ఎంత చేశారో అసలు బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ చాలా నిరుత్సాహంగా ఉందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రుణాలకు ఎంత డబ్బు కేటాయిస్తున్నారో ప్రస్తావించలేదన్నారు. ప్రణాళిక వ్యయాన్ని 36 నుంచి 24 శాతానికి తగ్గించారని, రాబోయే రోజుల్లో పరిస్థితికి ఈ తగ్గింపు అద్దం పడుతుందన్నారు. జీడీపీ పూర్తిస్థాయిలో తగ్గిపోయే ప్రమాదం కనబడుతోందన్నారు. గృహ నిర్మాణానికి బడ్జెట్లో అత్యంత తక్కువగా కేటాయింపులు జరిపారన్నారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రమాదకరంగా ఉందని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వేరుగా అన్నారు. ఇది ఆచరణ సాధ్యం అయ్యే బడ్జెట్ కాదన్నారు. బాబు కోరికలన్నీ బడ్జెట్లో పెట్టారని ఎద్దేవా చేశారు. వనరులు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. ప్రజల పైన పన్నులు వేయడమో, ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవడమో చేయాలన్నారు. విభజనతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నడుమ ఇలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితిగతులపై చర్చకు తాము సిద్ధమన్నారు.