బాబు చెప్తే ఆస్తులు ప్రకటించాలనే రూలుందా: జూపూడి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సమయం సందర్భం లేకుండా రాజకీయ నాయకులు ఆస్తులు ప్రకటించాలంటున్న బాబు తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ తనలా ఆస్తులు ప్రకటిస్తే ఈ దేశంలో అవినీతి తగ్గుతుందని ఒక విచిత్ర సిద్ధాంతకర్తలా బాబు చెప్పడం విచిత్రమన్నారు.
ఆయన ఆస్తులు ప్రకటించుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. బాబు ఆస్తుల ప్రకటనలో పొంతన లేదని, ప్రజలు వాటిని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాకమ్మ కథలు మాని రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, సమైక్యాంధ్ర సాధన కోసం సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ఎపిఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత దాడి వీరభద్ర రావు విశాఖలో అన్నారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 45 రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతున్నదన్నారు.
జీతాలు రావని తెలిసి కూడా పది లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది రాజకీయనేతలు ఉద్యమాన్ని తమ రాజకీయ లబ్ధికి వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని దాడి ఆరోపించారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేసిన అశోక్ బాబు ఇప్పుడు రాజీనామాలు అవసరం లేదని, అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఓడించడానికి కృషిచేయాలని 294 మంది ఎమ్మెల్యేలను కలిసి కోరతామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు.