రాజ్పథ్లో అలరించిన శకటాలు: తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైనిక విన్యాసాలు ఒక ఎత్తు అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే శకటాలు మరోక ఎత్తు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ర్టాలు తమ ప్రత్యేకతను చాటుతూ రాజ్పథ్లో శకటాలు ప్రదర్శిస్తుంటాయి. ముఖ్యంగా తమ తమ రాష్ర్టాల చరిత్ర, సంస్కృతులు ప్రతిభించేలా ఈ శకటాలను రూపొందిస్తుంటారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను కేవలం 15 రాష్ర్టాలు మాత్రమే తమ శకటాలను ప్రదర్శించాయి.
ఈ ఏడాది ఈ శకటాల ప్రదర్శనలో తెలుగు రాష్ర్టాల శకటాలకు చోటు దక్కలేదు. ఎప్పుడూ 115 నిమిషాలపాటు ఈ కార్యక్రమం జరిగితే ఈ ఏడాది ఆ సమయాన్ని 90 నిమిషాలు కుదించడమే కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రవేశం కల్పించలేదని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈసారి సైనిక కవాతులో శునక దళం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 26 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది శునకాలు రాజ్పథ్లో కవాతు చేశాయి. ఈ కవాతులో జర్మన్షెపర్డ్, లెబ్రేడర్ జాతులకు చెందిన 1200 శునకాల నుంచి 36 శునకాల్ని ఆర్మీ అధికారులు ఎంపిక చేశారు.
పేలుడు పదార్థాల్ని సమర్థంగా గుర్తించడంతోపాటు ఎన్నో సందర్భాల్లో సైనికుల ప్రాణాల్ని కాపాడుతున్నందుకుగాను వాటికి ఈ సారి ఆ గౌరవాన్ని కల్పించారు. ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.