పోలీస్ విధుల్లో...రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా...పట్టించుకోం: డీజీపీ మాలకొండయ్య
అనంతపురం: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యల పరిష్కారం కోసం తమను అడుగుతుంటారని, అయితే వాటిని ఒత్తిళ్లుగా భావించకూడదని ఎపి డిజిపి మాలకొండయ్య చెప్పారు. ఒక వేళ పోలీస్ విధుల్లో తమపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా...చట్టప్రకారమే ముందుకెళ్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య స్పష్టం చేశారు.
అనంతపురం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ కోర్టును డీజీపీ ఆదివారం ప్రారంభించారు. డీజీపీతో పాటు ఐజీ, డీఐజీ, జిల్లా ఎస్పీలు కాసేపు షటిల్ ఆడి అందర్నీ అలరించారు. అనంతరం ఫ్యాక్షన్ పికెట్స్ సిబ్బందికి మంచాలు, వంట సామాగ్రిని అందజేశారు. అనంతరం డిజిపి మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సమాజంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయని, అయితే తమ దృష్టికి వచ్చిన వాటిపై...పోలీసు పరిధిలో ఉన్న వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అగ్రిగోల్డ్ తరహాలో అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసే సంస్థల ఆగడాలను మాత్రం ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేస్తున్నామని ఎపి డీజీపీ వెల్లడించారు. అనంతరం ఆయన అనంతపురం జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో డిజిపి సమీక్ష నిర్వహించారు.